హైదరాబాద్: సైదాబాద్ బాలసదన్లో దారుణం జరిగింది. బాలుర గృహంలో ఆరుగురు బాలురపై స్టాఫ్ గార్డ్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితుల్లోని ఓ బాలుడి తల్లి సైదాబాద్ పోలీసులను ఆశ్రయించిన తర్వాత ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇటీవల దసరా పండగకి ఇంటికి వచ్చిన ఓ బాలుడు తిరిగి జువెనైల్ హోంకు వెళ్లనని బోరున విలపించడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలోనే ఎందుకు వెళ్లవు అంటూ బాలుడిని తల్లి దగ్గరికి తీసుకుని అడిగింది. తల్లి నెమ్మదిగా ఆరా తీయడంతో బాలుడు జరిగిన విషయాన్ని చెప్పాడు.
బాలసదన్లో చిన్నారులను కంటికి రెప్పొలే కాపాడాల్సిన స్టాఫ్గార్డ్ మానవ మృగంగా మారాడు. అభం శుభం తెలియని బాలురపై అసహజ పద్ధతిలో లైంగిక దాడి చేశారు. మొదట బాధితుడు ఒక్కడే అని పోలీసులు అనుకున్నారు. కూపీ లాగితే డొంక కదిలినట్టు నిందితుడు మరో ఐదుగురిపై కూడా లైంగిక దాడి చేసినట్టు తెలిసింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.