Hyderabad: భార్య వేధింపులు తాళలేక.. భర్త బలవన్మరణం

భార్య వేధింపులు తాళలేక పోయిన భర్త బలవన్మరణానికి పాల్పడ్డాడు. హైదరాబాద్‌ నగర పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.

By అంజి
Published on : 6 July 2023 2:26 AM

Hyderabad,  Husband Suicide, Crime news

Hyderabad: భార్య వేధింపులు తాళలేక.. భర్త బలవన్మరణం

అత్తతో ఉండొద్దు, వేరే కాపురం పెడదాం, ఆస్తి పిల్లల పేరు మీద రాయించు అంటూ భర్తను భార్య నిత్యం వేధింపులకు గురి చేసింది. అటు భార్య తల్లిదండ్రులు సైతం.. భర్తపై చీదరించుకునేలా మాట్లాడుతూ వేధింపులకు గురి చేశారు. ఈ వేధింపులు తాళలేక పోయిన ఆ భర్త బలవన్మరణానికి పాల్పడ్డాడు. హైదరాబాద్‌ నగర పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌ ఎస్సై షేక్‌ షఫీ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కుషాయిగూడలోని పోచమ్మగుడి దగ్గర ఉంటున్న మొలుగు వెంకట్‌ రెడ్డి (38)కి భార్య కల్యాణి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వెంటక్‌ రెడ్డి ప్రైవేట్‌ ఉద్యోగం చేసేవాడు. వెంకట్‌ రెడ్డితో పాటే అతడి తల్లి ఉంటోంది. ఈ క్రమంలోనే వెంటరెడ్డి భార్యకు, తల్లితో పొసగడం లేదు. అత్తతో ఉండొద్దని, వేరే కాపురం పెడదామని భర్తను భార్య వేధించింది.

దీంతో దంపతులమధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. రెండు నెలల క్రితం భార్య అలిగి పిల్లలను తీసుకుని వరంగల్‌లో తన పుట్టింటికి వెళ్లింది. ఈనెల 2వ తేదీన తల్లిదండ్రులను తీసుకుని భర్త ఇంటికివచ్చి మళ్లీ గొడవ మొదలు పెట్టింది. అత్తను ఇంటి నుంచి పంపించాలని, ఆస్తి పిల్లల పేరున రాయాలని తీవ్ర ఒత్తిడి చేసింది. భర్త ఎంత చెప్పినా వినలేదు. భార్య గట్టిగా అరుస్తుండటంతో బయటి వారు వింటే పరువు పోతుందని భర్త ఎంత చెప్పినా వినకపోగా.. ఇష్టారీతినా ప్రవర్తించింది. ఇలా పరువు పోయేలా ప్రవర్తిస్తే చచ్చిపోతానని భర్త హెచ్చరించాడు. అయినా వినకుండా భార్య, అత్తామామలు డ్రామాలు చేస్తున్నావు.. నీవా చచ్చేది అంటూ భర్తను హేళనచేశారు. మనస్తాపం చెందిన వెంకట్‌రెడ్డి తర్వాత అదేరోజు పురుగుల మందు తాగాడు. తల్లి ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. మృతుడి సోదరి ఫిర్యాదుతో కేసు నమోదుచేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Next Story