కాకినాడలో భారీ అగ్నిప్రమాదం.. మహిళ సజీవ దహనం

Huge Fire Accident In Kakinada. తూర్పుగోదావ‌రి జిల్లా కాకినాడలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.

By Medi Samrat  Published on  19 March 2021 3:51 AM GMT
Huge Fire Accident In Kakinada

తూర్పుగోదావ‌రి జిల్లా కాకినాడలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కాకినాడ‌లోని ఎల్విన్‌పేట ప్రాంతంలో సిలిండర్‌ పేలడంతో మూడు పూరిళ్లు దగ్ధమయ్యాయి. ఈ ఘ‌ట‌న‌లో విజయలక్ష్మి అనే మ‌హిళ‌ సజీవదహనం అయింది. ప్ర‌మాదం జ‌రిగిన‌ పూరి గుడిసెలో విజయలక్ష్మి (55) ఒంటరిగా ఉంటుంది. ఇంట్లో గ్యాస్‌ సిలిండర్ లీక‌వ‌డంతో ఒక్కసారిగా పేలి మంటలు చెలరేగాయి. దీంతో ఆమె అగ్నికి ఆహుతైంది.

మంటలు పక్కనున్న ఇళ్లకు కూడా వ్యాపించడంతో అందులో ఉన్న సిలిండర్లు కూడా పేలాయి. ప్ర‌మాదం జ‌రిగిన ప్రాంతంలో పెద్దగా శబ్దాలు రావడంతో పక్కనున్న పూరిళ్లలో ఉన్నవారు భ‌యంతో బయటికి పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో మూడు పూరిళ్లు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది.. వెంట‌నే సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని మూడు ఫైర్‌ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న పోలీసులు ఆ ప్రాంతాన్ని ప‌రిశీలించారు. మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకుని.. ఫోస్టుమార్టం నిమిత్తం ప్ర‌భుత్వాసుప‌త్రికి త‌ర‌లించారు. ఈ ప్రమాదంలో నాలుగు కుటుంబాలకు ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తోంది.



Next Story