రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలో పరువు హత్య చోటుచేసుకుంది. ఫరూక్ నగర్ మండలం ఎల్లంపల్లిలో ఇద్దరు వేర్వేరు సామాజిక వర్గానికి చెందిన యువతి, యువకుడు ప్రేమలో ఉన్నారు. అయితే తమ అమ్మాయిని ఇంటి నుంచి తీసుకెళ్లాడనే కోపంతో రాజశేఖర్ అనే వ్యక్తిని అమ్మాయి తండ్రి వెంకటేశ్ మరో కొంత మందితో కలిసి మహబూబ్నగర్ జిల్లా నవాబ్పేట్ మండలం ఎన్మాన్గండ్ల శివారులో హత్య చేసి పెట్రోల్ పోసి నిప్పంటించారు. అయితే ఈ విషయం వెలుగులోకి రావడంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. దీంతో ఎలాంటి ఘటనలు జరగకుండా గ్రామంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
వివరాల్లోకి వెళ్తే..మృతుడు చంద్రశేఖర్ ఆటో నడుపుకుంటూ జీవనోపాధి పొందుతూ ఉండేవాడు. అమ్మాయి డిగ్రీ చదువుతోంది. అయితే వీరిదద్దరూ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. గతంలో ఇద్దరూ ఇంటి నుంచి పారిపోగా, పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించి వేశారు. అయితే ఈ నెల 12వ తేదీన మరోసారి ఇంటి నుంచి పారిపోయారు. దీంతో ఆగ్రహించిన అమ్మాయి తండ్రి వెంకటేశ్ రాజశేఖర్ని అర్ధరాత్రి కిడ్నాప్ చేయించి హతమార్చాడు. అయితే కిడ్నాప్ విషయం గురించి పోలీసులకు సమాచారం ఇచ్చినా..స్పందించలేదని మృతుడి తండ్రి, సోదరుడు ఆరోపించారు.