ఆదిలాబాద్‌లో ఫేక్ సర్టిఫికెట్ల ముఠా గుట్టురట్టు..వివరాలు వెల్లడించిన ఉట్నూర్ ఏఎస్పీ

నకిలీ సర్టిఫికెట్లతో కేంద్ర సంస్థల్లో ఉద్యోగాలు సాధించిన ఇతర రాష్ట్రాల వ్యక్తుల బాగోతం ఆదిలాబాద్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది.

By Knakam Karthik
Published on : 29 Jun 2025 8:18 PM IST

Crime News, Telangana, Adilabad District, Fake Certificates, Police,

ఆదిలాబాద్‌లో ఫేక్ సర్టిఫికెట్ల ముఠా గుట్టురట్టు..వివరాలు వెల్లడించిన ఉట్నూర్ ఏఎస్పీ

ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ సర్టిఫికెట్లతో కేంద్ర సంస్థల్లో ఉద్యోగాలు సాధించిన ఇతర రాష్ట్రాల వ్యక్తుల బాగోతం వెలుగులోకి వచ్చింది. నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి సహకరించిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ముఠా ఇతర రాష్ట్రాలకు చెందిన 9 మంది యువకులకు నకిలీ ధృవపత్రాలు సృష్టించి, వాటితో ఉద్యోగాలు సంపాదించేందుకు సహాయం చేసి, వారి నుండి రూ.9 లక్షలు వసూలు చేసింది. ఈ వ్యవహారంపై సమాచారం అందుకున్న పోలీసులు ముగ్గురు ప్రధాన నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ సింగ్ వెల్లడించిన వివరాల మేరకు.. ఇచ్చోడా పోలీస్ స్టేషన్ పరిధి ఇస్లాంనగర్ గ్రామానికి చెందిన వ్యక్తి సహని సూరజ్ తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో సీఐఎస్‌ఎఫ్‌లో ఉద్యోగం సాధించాడు. అయితే పోలీస్ వెరిఫికేషన్‌లో ఆ వ్యక్తి చిరునామా తప్పుగా తేలడంతో అసలు విషయం బయటపడింది. అతను ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వాడిగా పోలీసులు ఐడెంటిఫై చేశారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన తొమ్మిది మంది ఇచ్చోడలో కొందరు వ్యక్తులను సంప్రదించారు. వారికి ఆధార్ కార్డు, నివాస ధ్రువీకరణ పత్రాలు కావాలని, ఒక్కొక్కరం రూ.లక్ష చొప్పున ఇస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. మొదట దీపక్ తివారీ అనే వ్యక్తి నకిలీ అడ్రస్‌తో ఆధార్ కార్డు, నివాస ధ్రువీకరణ పత్రం కోసం పంచాయతీ సెక్రటరీ వద్దకు వెళ్లారు. దీపక్ తివారీ స్థానిక గ్రామస్థుడు కాదని ఆ పంచాయతీ కార్యదర్శి సంతకం చేయలేదు.

దీనిని దృష్టిలో పెట్టుకుని ఇస్లాంనగర్ మాజీ సర్పంచ్ భర్త షేక్ ఫరీద్, ఫేక్ ఖలీం కలిసి పంచాయతీ కార్యదర్శి సంతకం ఫోర్జరీ చేశారు. అనంతరం మీ సేవలో దరఖాస్తు చేసి తప్పుడు నివాస ధ్రువపత్రం పొందారు. దీంతో దీపక్ తివారీ ఉద్యోగంలో చేరాడు. అనంతరం మిగిలిన 8 మందికి కూడా అదే తరహాలో సంతకం ఫోర్జరీ చేసి మీ సేవలో అప్లయ్ చేశారు. అయితే సర్టిఫికెట్లు వెరిఫై చేసినప్పుడు వారు ఇస్లాంనగర్ వాసులు కాదని నిర్ధారించారు. అయినా కూడా షేక్ ఫరీద్, షేక్ ఖలీం సలీం కలిసి మిగిలిన వారికి కూడా తప్పుడు రెసిడెన్షియల్ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డులు తయారు చేసి ఇచ్చారు. దీని కోసం వారి దగ్గర రూ.9 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో రూ.3 లక్షలు ఇద్దరూ పంచుకోగా, మిగిలిన రూ.6 లక్షలు యూపీలోని హుర్లిక్ వద్ద ఉన్నట్లు సమాచారం ఉందని.. పోలీసులు తెలిపారు.

అయితే ఈ నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారం సంగతి తెలుసుకున్న ఇస్లాంనగర్ వాసి జాదవ్ గజానంద్ ఇద్దరిని బెదిరించాడు. దీంతో గజానంద్‌కు ఖలీం, ఫరీద్ రూ.20 వేలు ఇచ్చారు. కాగా తప్పుడు పత్రాలు తయారు చేసిన షేక్ ఫరీద్, షేక్ ఖలీంల విషయం తెలిసి పోలీసులకు చెప్పకుండా దాచిపెట్టారని జాదవ్ గజానంద్‌తో పాటు ప్రధాన నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించినట్లు.. ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ సింగ్ తెలిపారు. కాగా ఈ సర్టిఫికెట్లు ఏ సంస్థలలో ఉపయోగించబడ్డాయి, ఇంకా ఎంత మంది బాధితులున్నారనే విషయాలపై లోతైన దర్యాప్తు కొనసాగుతోందని ఆమె పేర్కొన్నారు.

Next Story