వివాహేతర సంబంధం కారణంగా ఒకరు సూసైడ్ చేసుకోగా, మరొకరు సూసైడ్కు యత్నించి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంఘటన జోగులాంబ గద్వాల్ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలోని రాజోలికి చెందిన మహిళ (32)కు భర్త, కూతురు ఉన్నారు. అదే గ్రామంలోని పంచాయతీ ఆఫీసులో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పని చేస్తున్న పుల్లన్నతో మహిళకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ నెల 12వ తేదీన ఇద్దరూ గ్రామం నుంచి పారిపోయారు. ఈ ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్లో అదృశ్యం కేసు నమోదు అయ్యింది.
అయితే కూతురిని చూడాలనిపించి ఈ నెల 25వ తేదీన మహిళ గ్రామానికి వచ్చింది. ఈ సందర్భంగా తన ఇష్టపూర్వకంగానే పుల్లన్నతో వెళ్లినట్టు పోలీసులకు చెప్పింది. దీంతో ఇద్దరినీ పోలీసులు ఇళ్లకు పంపించారు. ఈ క్రమంలోనే రెండు కుటుంబాల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ నెల 27న పుల్లన్న ఎలుకల మందు తాగడంతో కర్నూలు ఆస్పతికి తరలించారు. ఈ విషయం తెలియడం, భర్త కూడా తీవ్రంగా బాధపడుతుండటాన్ని మహిళ తట్టుకోలేకపోయింది. దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో సదరు మహిళ ఉరివేసుకుని ఆత్మహత్యకు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.