మద్యం మత్తులో.. డబ్బు కోసం తల్లిపై కొడుకు దాడి

Drunken man beats up mother for money in AP. డబ్బుల కోసం కొడుకు కనికరం లేకుండా కొట్టడంతో ఓ తల్లికి తీవ్ర గాయాలయ్యాయి. కాకినాడ జిల్లాలో ఈ ఘటన

By అంజి  Published on  27 Sep 2022 4:08 AM GMT
మద్యం మత్తులో.. డబ్బు కోసం తల్లిపై కొడుకు దాడి

డబ్బుల కోసం కొడుకు కనికరం లేకుండా కొట్టడంతో ఓ తల్లికి తీవ్ర గాయాలయ్యాయి. కాకినాడ జిల్లాలో ఈ ఘటన జరగ్గా, సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. తెలిసిన వివరాల ప్రకారం.. కాజులూరు మండలం పల్లిపాలెం గ్రామానికి చెందిన తల్లిబోయిన లక్ష్మి(75)కి ముగ్గురు కుమారులు ఉన్నారు. ఆమెకు రూ.2,500 పింఛను వస్తుండగా, రెండేళ్ల క్రితం భర్త చనిపోయాడు. వీరిలో ఒకరైన టి వెంకన్న మద్యానికి బానిసై పింఛన్ డబ్బుల కోసం తల్లిని వేధిస్తున్నాడు.

ఆదివారం ఉదయం తల్లిని కొట్టి కాలుతో గొంతు నొక్కాడు. అపస్మారక స్థితికి చేరుకున్న ఆమెను ఇరుగుపొరుగు వారు యానాం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెదడులో అంతర్గత రక్తస్రావం అయిందని, స్పందించట్లేదని వైద్యులు తెలిపారు. కాకినాడ జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు ఆదేశాల మేరకు పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. వెంకన్న క్రూర చర్యలపై గతంలో ఒక వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయగా అతడిపై కత్తితో దాడి చేశాడు. దీంతో స్థానికులు, కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయలేదు. పోలీసులు భరోసా ఇవ్వడంతో బాధితురాలి పెద్ద కొడుకు సుబ్బారావు ఫిర్యాదు చేశాడని, నిందితుడిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి అరెస్టు చేశామని తెలిపారు.



Next Story