మ‌ద్యం మ‌త్తులో మ‌హిళా రోగిని చితకబాదిన డాక్టర్‌

Drunk Doctor beats woman patient at Chhattisgarh Hospital. ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లాలోని మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో మత్తులో ఉన్న ఒక వైద్యుడు

By M.S.R  Published on  10 Nov 2022 11:15 AM GMT
మ‌ద్యం మ‌త్తులో మ‌హిళా రోగిని చితకబాదిన డాక్టర్‌

ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లాలోని మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో మత్తులో ఉన్న ఒక వైద్యుడు మహిళా రోగిని దారుణంగా కొట్టాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆస్పత్రి యాజమాన్యం డాక్టర్‌పై షోకాజ్ నోటీసు జారీ చేసింది. బాధిత రోగి కుమారుడు శ్యామ్‌ కుమార్‌ తన తల్లి సుఖమతి ఆరోగ్యం అస్సలు బాగాలేకపోవటంతో 108,112 కు కాల్ చేశాడు. కానీ ఏ వాహనం రాలేదు. దీంతో అర్థరాత్రి సమయంలోనే తల్లిని ఆటో రిక్షాలో కోర్బా జిల్లా మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తీసుకొచ్చాడు. ఆ సమయంలో హాస్పిటల్ లో డ్యూటీలో ఓ డాక్టర్ మాత్రమే ఉన్నాడు. దీంతో డాక్టర్ మా అమ్మ ఆరోగ్యం అస్సలు బాగాలేదు కాస్త చూడండని వేడుకున్నాడు. కానీ అప్పటికే డ్యూటీలో ఉన్న ఆ డాక్టర్ మద్యం తాగి ఉన్నాడు. దీంతో తనను డిస్ట్రబ్ చేసారనే కోపంతో రోగిని పట్టుకుని కొట్టాడు. చికిత్స సమయంలో వైద్యుడు తన తల్లిని కొట్టాడని ఆరోపించాడు శ్యామ్‌ కుమార్‌. ఘటనకు సంబంధించిన వీడియోని కూడా సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశాడు. ఇది హాస్పిటల్ డీన్ దృష్టికి వెళ్లటంతో సదరు డాక్టర్‌కు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు.

కోర్బా జిల్లాలోని మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. ఈ క్రమంలోనే ఉన్నతాధికారులు సదరు డాక్టర్‌కు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. ఈ విషయం తన దృష్టికి వచ్చిందని, వైద్యుడిపై షోకాజ్ నోటీసు జారీ చేశామని మెడికల్ కాలేజీ హాస్పిటల్ డీన్ డాక్టర్ అవినాష్ మెష్రామ్ తెలిపారు.


Next Story