బెంగళూరులో క్రిస్మస్ వేడుకల సందర్భంగా ఓ మాల్లో ఒక మహిళను లైంగికంగా వేధించినందుకు 27 ఏళ్ల డెలివరీ బాయ్ని అరెస్టు చేసినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. నిందితుడు మనోజ్ చంద్ అస్సాంకు చెందినవాడని.. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సర్వీస్లో పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహిళ తన భర్త, బిడ్డతో కలిసి డిసెంబర్ 25న మాల్కు వెళ్లగా.. క్రిస్మస్ వేడుకలు జరుపుకునేందుకు సందర్శకులు రావడంతో మాల్ కిక్కిరిసిపోయింది. మహిళ మాల్ లోపల ఉన్న క్రిస్మస్ చెట్టు పక్కన నిలబడి ఉండగా.. నిందితుడు మద్యం మత్తులో ఆమెను అనుచితంగా తాకి పారిపోయాడని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. సదరు మహిళ వెంటనే తన భర్త, పోలీసు సిబ్బందిని అప్రమత్తం చేయగా నిందితుడిని పట్టుకున్నట్లు తెలిపారు. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 74 (స్త్రీపై దాడి లేదా నేరపూరిత బలవంతం) కింద నిందితుడిపై కేసు నమోదు చేసి, అతన్ని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.