దారుణం.. అప్పుడే పుట్టిన ఆడశిశువులను చంపి.. పాతిపెట్టిన తండ్రి
దేశ రాజధాని న్యూఢిల్లీలో దారుణ ఘటన జరిగింది. అప్పుడే పుట్టిన ఇద్దరు కవల ఆడశిశువుల తండ్రి హత్య చేశాడు.
By అంజి Published on 24 Jun 2024 4:37 PM IST
దారుణం.. అప్పుడే పుట్టిన ఆడశిశువులను చంపి.. పాతిపెట్టిన తండ్రి
దేశ రాజధాని న్యూఢిల్లీలో దారుణ ఘటన జరిగింది. అప్పుడే పుట్టిన ఇద్దరు కవల ఆడశిశువుల తండ్రి హత్య చేశాడు. ఇద్దరు ఆడపిల్లలు పుట్టడం పట్ల తండ్రి సంతోషంగా లేడని, అందుకే ఈ దారుణానికి ఒడిగట్టాడని సమాచారం. తండ్రి, అతని కుటుంబం ఇద్దరు నవజాత కవలలను చంపి, పూడ్చిపెట్టారు.
అప్పుడే పుట్టిన బిడ్డలను తండ్రి తీసుకెళ్లి చంపేశాడని పోలీసులు తెలిపారు. ఫిర్యాదును స్వీకరించిన తర్వాత, ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగారు. న్యాయ ఆదేశాల మేరకు శిశువుల మృతదేహాలను బయటకు తీశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సంజయ్ గాంధీ ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. శవపరీక్ష నివేదిక వచ్చిన తర్వాతే మృతికి గల కారణాలు వెల్లడవుతాయని పోలీసులు తెలిపారు. దీంతో ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆడ శిశువుల తాతను అరెస్ట్ చేశారు. అయితే భర్త పరారీలో ఉన్నాడు. ఎఫ్ఐఆర్ ప్రకారం.. పూజా సోలంకి అనే మహిళ ఇటీవల ఇద్దరు కవల ఆడపిల్లలకు జన్మనిచ్చింది.
జూన్ 1న, పూజ తన బిడ్డలతో సహా ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయింది. ఆమె రోహ్తక్లోని తన తల్లి ఇంటికి వెళ్లాలనుకుంది, కానీ ఆమె భర్త నీరజ్ సోలంకి తన కారులో శిశువులను తీసుకొని మరొక కారులో ఆమెను అనుసరించమని చెప్పాడు. అయితే మధ్యలో నీరజ్ రూటు మార్చాడు. మహిళ సోదరుడు నీరజ్కు ఫోన్ చేసేందుకు ప్రయత్నించగా, కాల్ కనెక్ట్ కాలేదు. ఆ తర్వాత నీరజ్ కుటుంబీకులే శిశువులను పాతిపెట్టినట్లు పూజా సోదరుడు గుర్తించారు. పూజ 2022లో నీరజ్ని వివాహం చేసుకుంది. ఎఫ్ఐఆర్ ప్రకారం, పూజ అత్తమామలు కట్నం కోసం ఆమెను వేధించేవారు.