ఇంటర్ విద్యార్థిని మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం

కడప జిల్లా బద్వేల్ లో యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇంటర్ విద్యార్థిని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

By Kalasani Durgapraveen  Published on  20 Oct 2024 9:05 AM GMT
ఇంటర్ విద్యార్థిని మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం

కడప జిల్లా బద్వేల్ లో యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇంటర్ విద్యార్థిని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఎంతో భవిష్యత్ ఉన్న విద్యార్థిని ఒక దుర్మార్గుడి దుశ్చర్యకు బలికావడంపై ముఖ్యమంత్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

ఘటనపై నిన్నటి నుంచి పోలీసు అధికారులతో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి.. ఎప్పటికప్పుడు ఆమెకు అందుతున్న చికిత్స గురించి, కేసు విచారణ గురించి తెలుసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేశామని జిల్లా ఎస్పీ సీఎంకు వివరించారు. వేగంగా విచారణ పూర్తి చేసి, నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలని సీఎం ఆదేశించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయడం అంటే.. హంతకుడిని త్వరగా, చట్టబద్దంగా శిక్షించడమే అని సీఎం అన్నారు. ప్రత్యేక కోర్టు లో ఫాస్ట్ ట్రాక్ విధానంలో ఈ కేసు విచారణ పూర్తి చేసి నిందితుడికి శిక్షపడేలా చూడాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఘటనలో నేరస్తుడికి మరణ శిక్ష స్థాయి శిక్ష పడేలా చూడాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. మహిళలు, ఆడబిడ్డలపై అఘాయిత్యాలు చేసేవారికి ఈ ఘటనలో పడే శిక్ష ఒక హెచ్చరికగా ఉండాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు.

Next Story