ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం పూర్వాంచల్ ఎక్స్ప్రెస్వేపై రోడ్డు పక్కన ఆగి ఉన్న వ్యాగన్ఆర్ కారును వేగంగా వచ్చిన బ్రెజ్జా కారు ఢీకొట్టింది. ఘటన జరిగిన సమయంలో వ్యాగన్ఆర్ కారులో కొందరు బయటకు నిలబడి ఉండగా.. లోపల కొందరు కూర్చున్నారు. వేగంగా ఢీకొనడం వల్ల వ్యాగన్ ఆర్ కార్ పల్టీలు కొడుతూ రెండు వందల మీటర్ల దూరం వరకూ దూసుకెళ్లగా.. భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులతో సహా వ్యాగన్ఆర్లో ప్రయాణిస్తున్న ఐదుగురు మృతి చెందారు.
అదే సమయంలో బ్రెజా కారులో ఉన్న నలుగురికి గాయాలైనట్లు సమాచారం. సుబేహా పోలీస్ స్టేషన్లోని రతౌలీ ధిహ్ వద్ద పూర్వాంచల్ ఎక్స్ప్రెస్వేపై పాయింట్ 51.6 వద్ద ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు క్షతగాత్రులను బయటకు తీసి పోలీసులకు సమాచారం అందించారు. మృతులను గుర్తించలేకపోయారు. కాగా, క్షతగాత్రులు హైదర్గఢ్ సిహెచ్సిలో చికిత్స పొందుతున్నారు.