హోటల్ రూమ్లో ప్రియురాలిని దారుణంగా హత్య చేసిన ప్రియుడు
బెంగళూరులోని ఓ హోటల్లో సంచలనం సృష్టించిన ఘటన వెలుగులోకి వచ్చింది.
By Medi Samrat
బెంగళూరులోని ఓ హోటల్లో సంచలనం సృష్టించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓయో హోటల్లో ప్రియుడి చేతిలో మహిళ హత్యకు గురైంది. ఈ ఘటన శుక్రవారం అర్థరాత్రి జరిగినా.. రెండు రోజుల తర్వాతే వెలుగులోకి వచ్చింది. బాధితురాలిని 33 ఏళ్ల హరిణిగా గుర్తించారు. నిందితుడు యషాస్ 25 ఏళ్ల సాప్ట్వేర్ ఇంజనీర్. ఇద్దరూ బెంగళూరులోని పశ్చిమ శివారులోని కెంగేరి నివాసితులు. మహిళ కంటే ఆమె ప్రియుడు 8 ఏళ్లు చిన్నవాడని.. ఆ మహిళ వివాహమై ఇద్దరు పిల్లలకు తల్లి అని చెబుతున్నారు.
పూర్ణ ప్రజ్ఞా లేఅవుట్లోని ఓయో హోటల్ గదిలో హరిణిని కత్తితో పొడిచి హత్య చేశాడు ఆమె ప్రియుడు. సుబ్రహ్మణ్యపుర పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సౌత్ డీసీపీ లోకేష్ బి జగ్లాసర్ మాట్లాడుతూ.. 'జూన్ 6, 7 తేదీల్లో రాత్రి సుబ్రమణ్యపుర పోలీస్ స్టేషన్కు హత్య గురించి సమాచారం అందింది. ఆ మహిళ ప్రియుడితో బంధానికి స్వస్తి చెప్పాలనుకుంది. ఈ విషయం అతడికి చెప్పి నెల రోజుల నుంచి అతని నుండి దూరంగా ఉండటానికి మహిళ ప్రయత్నిస్తోంది. ఇది నచ్చని ఆ వ్యక్తి కోపం, అసూయతో రగిలిపోయి.. మహిళను కత్తితో పొడిచి చంపాడు.' ప్రస్తుతం నిందితుడిని అరెస్ట్ చేశారు.
అలాంటి మరో సంఘటనలో 28 ఏళ్ల వ్యక్తి తన భార్యను నరికివేసి తలను బెంగళూరులోని అనేకల్ ప్రాంతంలోని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లాడు. శంకర్ అనే నిందితుడు తన 26 ఏళ్ల భార్య మానసను వివాహేతర సంబంధానికి సంబంధించిన వివాదంలో హత్య చేశాడు.