అమరావతి: సోషల్ మీడియా స్నేహాలు విషాదాంతమవుతున్నాయి. తాజాగా ఇన్స్టాలో పరిచయమైన ఇంటర్ అమ్మాయిని రాహుల్ అనే యువకుడు ప్రేమ పేరుతో వంచించాడు. విజయవాడలోని లాడ్జికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. మంగళగిరిలోనూ మైనర్పై నలుగురు గ్యాంగ్ రేప్నకు పాల్పడ్డారు. బాధితురాళ్ల పేరెంట్స్ ఫిర్యాదుతో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పిల్లల స్మార్ట్ఫోన్ వాడకం, సోషల్ మీడియా ఖాతాలపై పేరెంట్స్ నిఘా ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళగిరి పరిధిలో ఓ నలుగురు యువకులు బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు. మాయ మాటలు చెప్పి బాలికను మోసం చేశారు. ఆ తరువాత బాలికపై లైంగిక దాడి చేశారు. దీంతో బాలిక తీవ్రంగా గాయపడింది. జరిగిన దారుణాన్ని బయటకు చెబితే చంపేస్తామని నిందితులు బాలికను బెదిరింపులకు దిగారు.
దీంతో బాధితురాలు ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా మౌనంగా ఉండి పోయింది. బాలిక మౌనంగా ఉండటాన్ని చూసిన కుటుంబ సభ్యులు ఆమెను దగ్గరకు తీసుకుని అడుగగా.. అసలు విషయం బయటపడింది. దీంతో బాలిక తల్లిదండ్రులు మంగళగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.