వరంగల్‌ జిల్లాలో దారుణం.. ప్రియురాలి తల్లిదండ్రులను చంపిన ప్రియుడు

వరంగల్‌ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రేమ పెళ్లిని కాదన్నారని ఓ యువకుడు ఉన్మాదిగా మారాడు.

By అంజి  Published on  11 July 2024 4:49 AM GMT
Warangal, Chennaraopet, Crime, Murder

వరంగల్‌ జిల్లాలో దారుణం.. ప్రియురాలి తల్లిదండ్రులను చంపిన ప్రియుడు

వరంగల్‌ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రేమ పెళ్లిని కాదన్నారని ఓ యువకుడు ఉన్మాదిగా మారాడు. తన ప్రియురాలి తల్లిదండ్రులను చంపేశాడు. ఈ ఘటన చెన్నారావుపేట మండలం పదహారు చింతల తండాలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పదహారు చింతల తండాలో బానోతు శ్రీనివాస్‌(45), బానోతు సుగుణ (40) దంపతులు నివాసం ఉంటున్నారు. వారి కూతురు దీపికను గుండెంగ గ్రామానికి చెందిన బన్నీ అనే యువకుడు గతేడాది నవంబర్‌లో లవ్‌ మ్యారేజ్‌ చేసుకున్నాడు.

జనవరిలో యువతి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించడంతో.. పోలీసులు ఇరువర్గాలకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ఆ తర్వాత యువతిని తల్లిదండ్రులతో పంపించారు. అప్పటి నుంచి యువతి ఇంటి దగ్గరే ఉంటూ హనుమకొండలో డిగ్రీ సెకండీయర్‌ చదువుతోంది. తల్లిదండ్రులు ఆమెకు మ్యారేజ్‌ ప్రపోజల్స్‌ చూస్తున్నారని బన్నీకి తెలిసింది. దీంతో బన్నీ ఉన్మాదిగా మారాడు. గురువారం ఉదయం పదునైన ఆయుధంతో ఇంటి ముందు నిద్రిస్తున్న శ్రీనివాస్‌, సుగుణ దంపతులపై దాడికి పాల్పడ్డాడు.

సుగుణ అక్కడికక్కడే మృతిచెందింది. శ్రీనివాస్‌కు తీవ్ర గాయాలు కావడంతో కుటుంబసభ్యులు నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడే చికిత్స పొందుతూ శ్రీనినవాస్‌ మృతి చెందాడు. ఈ ఘటనలో దీపిక, ఆమె సోదరుడు మదన్‌లాల్‌ కూడా గాయపడ్డారు. వారిని వైద్యం కోసం హన్మకొండలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story