Hyderabad: ఆస్తి కోసం తల్లిని చంపిన కొడుకు

ఓ కొడుకు ఆస్తి కోసం తన భార్యతో కలిసి ఏకంగా తల్లిని అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది.

By అంజి  Published on  7 Jan 2024 7:58 AM GMT
Hyderabad,  property, Crime news, Ramanthapur

Hyderabad: ఆస్తి కోసం తల్లిని చంపిన కొడుకు 

నేటి సమాజంలో బంధం, అనుబంధాలు కనుమరుగయ్యాయి. కేవలం ఆస్తులు ఉంటేనే బంధం.. లేకపోతే లేదు.. చివరకు ఆస్తి లేకపోతే తల్లిదండ్రులను సైతం రోడ్డుపై అనాధలుగా వదిలేస్తున్న సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. తాజాగా ఓ కొడుకు ఆస్తి కోసం తన భార్యతో కలిసి ఏకంగా తల్లిని అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా భయభ్రాంతులకు గురి చేసింది. రామంతపూర్‌లో సుగుణమ్మ అనే మహిళ నివాసం ఉంటోంది. ఆమెకు కొడుకు అనిల్, కోడలు తిరుమల ఉన్నారు. రామంతపూర్‌లో సుగుణమ్మ పేరు మీద ఉన్న ఇల్లును కొడుకు, కోడలు అమ్మాలని చూశారు. ఈ విషయం కొడుకు తల్లికి చెప్పాడు.

తాను బతికుండగా తాను ఉంటున్న ఇల్లు అమ్మడానికి వీలు లేదని సుగుణమ్మ తేల్చి చెప్పింది. ఈ విషయంలో ప్రతిరోజు సుగుణమ్మ ఆమె కొడుకు మధ్య వాగ్వవాదం చెలరేగుతూనే ఉండేది. ఈ క్రమంలోనే సుగుణమ్మ ఇల్లు అమ్మడానికి ఒప్పుకోకపోవడంతో ఆగ్రహానికి లోనైనా కొడుకు అనిల్ తన భార్య తిరుమలతో కలిసి తల్లిని హత్య చేయాలని ప్లాన్ చేశాడు. కొడుకు అనిల్ తన భార్య తిరుమల, అతని స్నేహితులతో కలిసి తల్లిని అతి దారుణంగా హత్య చేసి అనంతరం సహజ మరణంగా చిత్రీకరించి.. బంధువుల ముందు బోరున విలపించారు.

బంధువులందరూ సహజ మరణం గానే భావించారు. కానీ అంత్యక్రియల సమయంలో అనిల్ చేస్తున్న వ్యవహారం చూసి బంధువులకు అనుమానం రావడంతో కూపీ లాగారు. దీంతో విషయం మొత్తం బయటపడింది. బంధువులు వెంటనే ఉప్పల్ పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకుని రంగంలోకి దిగిన పోలీసులు హత్య చేసిన ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. హత్యకు ప్లాన్ ఎలా చేశారు, సుగుణమ్మను ఎలా హతమార్చారు? తదితర వివరాలను నిందితుల నుండి పోలీసులు సేకరిస్తున్నారు.

Next Story