హైద‌రాబాద్‌లో మ‌రో ప‌రువు హ‌త్య‌.. రాయితో మోదీ, క‌త్తుల‌తో పొడిచి

Another Honour killing in Hyderabad.కార‌ణం ఏదైన‌ప్ప‌టికీ ఇటీవ‌ల కాలంలో ప‌రువు హ‌త్య‌లు పెరిగిపోతున్నాయి. కుమారై లేదా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 May 2022 3:17 AM GMT
హైద‌రాబాద్‌లో మ‌రో ప‌రువు హ‌త్య‌.. రాయితో మోదీ, క‌త్తుల‌తో పొడిచి

కార‌ణం ఏదైన‌ప్ప‌టికీ ఇటీవ‌ల కాలంలో ప‌రువు హ‌త్య‌లు పెరిగిపోతున్నాయి. కుమారై లేదా కుమారుడు ప్రేమ వివాహాం చేసుకోవ‌డం నచ్చ‌ని కుటుంబ స‌భ్యులు దారుణాల‌కు తెగ‌బ‌డుతున్నారు. త‌మ ప‌రువు పోయింద‌ని బావిస్తూ వారిని అంత‌మొందించేందుకు వెనుకాడ‌డం లేదు. ఇటీవ‌ల స‌రూర్ న‌గ‌ర్‌లో నాగ‌రాజును హ‌త్య‌ను మ‌రువ‌క ముందే తాజాగా బేగంబ‌జార్‌లో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ వివాహం చేసుకున్నాడ‌న్న కార‌ణంతో యువ వ్యాపారిని శుక్ర‌వారం రాత్రి అంద‌రూ చూస్తుండ‌గానే హ‌త‌మార్చారు.

వివ‌రాల్లోకి వెళితే.. బేగంబ‌జార్ కోల్సావాడిలో నీర‌జ్‌కుమార్ ప‌న్వ‌ర్‌(22) త‌న కుటుంబంతో క‌లిసి నివ‌సిస్తున్నాడు. ఇత‌డు ప‌ల్లీల వ్యాపారం చేస్తుండేవాడు. అదే ప్రాంతానికి చెందిన సంజ‌న‌(20)ను ఏడాదిన్న‌ర కింద‌ట ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి నెలన్న‌ర క్రితం బాబు జ‌న్మించాడు. ఈ క్ర‌మంలో సంజ‌న కుటుంబ స‌భ్యులు క్ష‌క్ష పెంచుకున్న‌ట్లు తెలుస్తోంది.

శుక్రవారం రాత్రి నీర‌జ్ ఇంటికి వెలుతుండ‌గా.. బేగం బ‌జార్ ప‌రిధిలోని మ‌చ్చి మార్కెట్‌లో సంజ‌న సోద‌రుడు త‌న స్నేహితుల‌తో నీర‌జ్‌పై దాడి చేసి హ‌త‌మార్చాడు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. ర‌క్త‌పు మ‌డుగులో ప‌డి ఉన్న నీర‌జ్‌ను ఉస్మానియా ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా.. అప్ప‌టికే అత‌డు మ‌ర‌ణించిన‌ట్లు వైద్యులు తెలిపారు. సీసీ కెమెరాల ఆధారంగా ఐదుగురు వ్య‌క్తులు ఈ దారుణానికి పాల్ప‌డ్డార‌ని పోలీసులు గుర్తించారు. దీనిపై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Next Story