హైదరాబాద్లో దారుణం.. పెద్దనాన్న వేధింపులు తట్టుకోలేక 17 ఏళ్ల బాలిక ఆత్మహత్య
మానవత్వం మంట గలిసింది. డబ్బు కోసం కొందరు తన, మన అనే తేడా లేకుండా విచక్షణ కొల్పోయి ప్రవర్తిస్తున్నారు.
By - అంజి |
హైదరాబాద్లో దారుణం.. పెద్దనాన్న వేధింపులు తట్టుకోలేక 17 ఏళ్ల బాలిక ఆత్మహత్య
మానవత్వం మంట గలిసింది. డబ్బు కోసం కొందరు తన, మన అనే తేడా లేకుండా విచక్షణ కొల్పోయి ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటన హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది. ఇంటికి పెద్దదిక్కును కొల్పోయిన ఆ కుటుంబానికి అండగా నిలవాల్సిన పెద్దనాన్న.. తన సొంత తమ్ముడి కూతురితో అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ క్రమంలోనే అవమానాలు భరించలేక బాలిక సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసింది. ఈ ఘటన గురువారం నాడు పేట్బషీరాబాద్ పీఎస్లో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
నిజామాబాద్ జిల్లాకు చెందిన దంపతులు కొంపల్లిలో ఉంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. పెద్ద కూతురు ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ చదువుతోంది. బాలిక తండ్రి, అతని తమ్ముడు శ్రీను ఓ ప్రైవేట్ ఫైనాన్స్లో రూ.5 లక్షలు అప్పు తీసుకున్నారు. ఆ తర్వాత వాయిదాలు చెల్లించే క్రమంలో ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. ఈ క్రమంలోనే 6 నెలల కిందట బాలిక తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో మిగిలిన వాయిదాలు చెల్లించాలని తమ్ముడి భార్య, పిల్లలపై శ్రీను ఒత్తిడికి పాల్పడ్డాడు. అప్పటి నుండి తమ్ముడి పెద్ద కూతురిని శారీరకంగా, మానసికంగా వేధించడం మొదలు పెట్టాడు.
గురువారం నాడు బాలిక ఒంటరిగా ఉన్న సమయంలో ఇంట్లోకి వెళ్లిన శ్రీను.. ఆమె బాత్రూమ్లో ఉండగా వీడియో తీశాడు. ఇల్లు అమ్మేసి అప్పు తీర్చకపోతే వీడియోలను బయటపెడతానంటూ బెదిరించాడు. దీంతో బాలిక జరిగిన విషయాన్ని తన తల్లికి ఫోన్ ద్వారా చెప్పింది. ఆ తర్వాత సూసైడ్ నోట్ రాసి ఉరేసుకుంది. తన చావుకు కారణం శ్రీను అని, తనకు బతకాలని లేదని, వారానికోసారి వచ్చి గొడవ చేస్తుంటే పరువు పోతోందని నోట్లో పేర్కొంది. వాడికి కచ్చితంగా శిక్ష పడాలి అని లేఖలో పేర్కొంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు శ్రీనును అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
(రోషిణి ఆత్మహత్య నివారణ హెల్ప్లైన్ నంబర్లు: 8142020033/44 మరియు 040 66202000/2001.)