మరో పేలుడు ఘటన.. ఇద్దరు మహిళలు సహా ఐదుగురు దుర్మరణం
తమిళనాడులోని బాణాసంచా ఫ్యాక్టరీలో మంగళవారం ఉదయం జరిగిన పేలుడు ఘటనలో ఐదుగురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు.
By Medi Samrat
తమిళనాడులోని బాణాసంచా ఫ్యాక్టరీలో మంగళవారం ఉదయం జరిగిన పేలుడు ఘటనలో ఐదుగురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. విరుదునగర్ జిల్లా శివకాశి సమీపంలోని చిన్న కమాన్పట్టి గ్రామంలోని బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించినట్లు సమాచారం.
శివకాశి సమీపంలోని చిన్నకామన్పట్టిలో బాణసంచా తయారీ కర్మాగారంలో జరిగిన పేలుడులో ఐదుగురు మృతి చెందగా, మరో ఐదుగురు గాయపడినట్లు విరుదునగర్ జిల్లా ఎస్పీ కన్నన్ తెలిపారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం విరుదునగర్ ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు.
మూలాల ప్రకారం.. పేలుడుకు అగ్గి కారణమైందని అంటున్నారు. పేలుడు సమయంలో ఫ్యాక్టరీ చుట్టూ దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. లోపల్నుంచి పటాకుల శబ్దాల మోత హోరెత్తింది. పేలుడుకు గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. అక్కడ వారికి చికిత్స కొనసాగుతోంది.
తెలంగాణలోని పాశమైలారం ప్లాంట్లో రియాక్టర్ పేలుడు సంభవించి 42 మంది మృతి చెందిన ఘటన మరవకముదే.. ఈ బాణాసంచా ఫ్యాక్టరీ పేలుడు సంభవించింది. బాణాసంచా తయారీ కర్మాగారంలో అకస్మాత్తుగా పేలుడు సంభవించడంతో ఇద్దరు మహిళలు సహా కనీసం ఐదుగురు కార్మికులు మరణించినట్లు పోలీసులు తెలిపారు. పేలుడు అనంతరం ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో పలువురు గాయపడగా, ఫ్యాక్టరీ కాలి బూడిదైంది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మంటలను అదుపులోకి తెచ్చామని, శిథిలాల తొలగింపునకు ప్రస్తుతం ప్రయత్నాలు జరుగుతున్నాయని ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీసెస్ డిపార్ట్మెంట్ అధికారి ఒకరు తెలిపారు. ఈ ఘటనపై రెవెన్యూ అధికారులు, పోలీసులు శివకాశి సమీపంలోని చిన్నకామన్పట్టిలోని ప్రైవేట్ బాణసంచా తయారీ యూనిట్కు చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.