చెట్టును ఢీ కొట్టిన కారు.. మృత‌దేహాల‌ను తీసేందుకు ఆరు గంట‌ల స‌మయం

3 Killed after car hits tree in Madhya Pradesh's Niwari.కారు చెట్టును ఢీ కొట్ట‌గా అందులోంచి మృత‌దేహాల‌ను బ‌య‌ట‌కు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 Nov 2022 6:22 AM GMT
చెట్టును ఢీ కొట్టిన కారు.. మృత‌దేహాల‌ను తీసేందుకు ఆరు గంట‌ల స‌మయం

కొన్ని ప్ర‌మాద ఘ‌ట‌న‌లు చాలా భ‌యాన‌కంగా ఉంటాయి. క‌నీసం మృత‌దేహాల‌ను కూడా గుర్తుప‌ట్ట‌లేనంత‌గా ప్ర‌మాదాలు చోటు చేసుకుంటాయి. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో జ‌రిగిన ఓ ప్ర‌మాద ఘ‌ట‌న హృద‌య‌విదార‌కంగా క‌నిపిస్తోంది. ప్ర‌మాద‌వ‌శాత్తు కారు చెట్టును ఢీ కొట్ట‌గా అందులోంచి మృత‌దేహాల‌ను బ‌య‌ట‌కు తీసేందుకు ఆరుగంట‌ల స‌మ‌యం ప‌ట్టింది.

ప్రివ్‌తిపూర్ సబ్ డివిజనల్ ఆఫీసర్ ఆఫ్ పోలీస్ (ఎస్‌డీఓపీ) సంతోష్ పటేల్ తెలిపిన వివ‌రాలు ఇలా ఉన్నాయి. నిన్న రాత్రి నివారిజిల్లాలోని బిష‌న్‌పురా గ్రామ స‌మీపంలో చెట్టును కారు ఢీ కొట్టింది. ఈ ప్ర‌మాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా, మరొకరు గాయ‌ప‌డ్డారు. మృతి చెందిన వారిని కనోరా నివాసి వినోద్ యాదవ్ (45), సర్సోరా నివాసి దీపక్ యాదవ్ (30), మోహన్‌పురా నివాసి నరేంద్ర యాదవ్ (27)గా గుర్తించారు. గాయపడిన వ్యక్తిని సాహిబ్ సింగ్ యాదవ్‌గా గుర్తించారు. అత‌డిని చికిత్స నిమిత్తం ఝాన్సీ మెడికల్ కాలేజీలో చేర్చారు.

ప్ర‌మాద స‌మ‌యంలో కారులో న‌లుగురు ఉన్నార‌ని, విహార‌యాత్ర‌కు వెళ్లి పార్టీ చేసుకున్న త‌రువాత పృథ్వీపూర్‌కు తిరిగి వస్తున్నారని తెలిపారు. స‌మాచారం అందుకున్న వెంట‌నే ఘ‌ట‌నాస్థ‌లానికి పోలీసులు చేరుకున్నారు. ప్ర‌మాదం ధాటికి కారు నుజ్జు నుజ్జు అయింది. అందులో ఉన్న వారిని బ‌య‌ట‌కు తీసేందుకు వీలు లేకుండా పోయింది. క‌ట్ట‌ర్ సాయంతో దాదాపు ఆరు గంట‌ల పాటు శ్ర‌మించి అందులో మృత‌దేహాల‌ను బ‌య‌ట‌కు తీసి పోస్టుమార్టంకి పంపించిన‌ట్లు తెలిపారు.

ఈ ప్ర‌మాదం పై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. అతి వేగం, మ‌ద్యం మ‌త్తులో ఉండ‌డంతో మూల మ‌లుపును త‌ప్పుగా అంచ‌నా వేయ‌డంతో ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు గ్రామ‌స్తులు చెబుతున్నారు.

Next Story