బట్టతల మీద జుట్టు.. ఇద్దరు ప్రాణాలు తీసిన డాక్టర్ లొంగుబాటు

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ శస్త్రచికిత్స జరిగిన 48 గంటల్లోనే ఇద్దరు ఇంజనీర్లు వినిత్ కుమార్ దూబే, ప్రమోద్ కటియార్ మరణించారు.

By Medi Samrat
Published on : 26 May 2025 8:45 PM IST

బట్టతల మీద జుట్టు.. ఇద్దరు ప్రాణాలు తీసిన డాక్టర్ లొంగుబాటు

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ శస్త్రచికిత్స జరిగిన 48 గంటల్లోనే ఇద్దరు ఇంజనీర్లు వినిత్ కుమార్ దూబే, ప్రమోద్ కటియార్ మరణించారు. అప్పటి నుండి నిందితురాలు డాక్టర్ అనుష్క తివారీ పరారీలో ఉంది. అయితే ఎట్టకేలకు సోమవారం స్థానిక కోర్టులో లొంగిపోయింది. ఆమెను జైలుకు తరలించారు పోలీసులు.

ఇంజనీర్ వినిత్ కుమార్ దూబే భార్య జయ త్రిపాఠి మే 9న పోలీసులకు ఫిర్యాదు చేశారు. శస్త్రచికిత్స మార్చి 13న జరిగిందని, ఆమె భర్త మార్చి 15న వేరే ఆసుపత్రిలో మరణించారని బాధితుడి భార్య తెలిపింది. పోలీసులు మొదట ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోలేదని జయ త్రిపాఠి ఆరోపించారు. ముఖ్యమంత్రి ఫిర్యాదుల విభాగంలో ఫిర్యాదు చేసిన తర్వాతే మే 9న పోలీసులు కేసు నమోదు చేశారు. అనుష్క తివారీ రంగానికి చెందిన విభాగం కాకపోయినా ఆమె శస్త్రచికిత్స చేశారు, దీనికి సంబంధించి మా వద్ద తగిన ఆధారాలు ఉన్నాయని ప్రభుత్వ న్యాయవాది దిలీప్ సింగ్ తెలిపారు.

వినిత్ కుమార్ దూబే భార్య పోలీసు ఫిర్యాదులో మార్చి 14న తన భర్త ముఖం వాపుకు గురైందని తనకు ఫోన్ వచ్చిందని ఆరోపించింది. తాను వైద్యుడిని సంప్రదించడానికి ప్రయత్నించినప్పటికీ ఫలితం లేదని ఆమె చెప్పారు."అదే రాత్రి 11 గంటల ప్రాంతంలో మళ్ళీ డాక్టర్ అనుష్క తివారీకి ఫోన్ చేసాము. పరీక్ష లేకుండానే శస్త్రచికిత్స చేశానని ఆమె అంగీకరించింది" అని జయ త్రిపాఠి తెలిపారు. ఈ సంభాషణకు సంబంధించిన కాల్ రికార్డ్ తన వద్ద ఉందని కూడా ఆమె అన్నారు. తన భర్తను వేరే ఆసుపత్రికి తరలించారని, అక్కడ మార్చి 15న ఆయన మరణించారని ఆమె తన ఫిర్యాదులో తెలిపారు. ఆ రోజు నుంచి డాక్టర్ కనిపించడం లేదని ఆరోపించారు.

Next Story