మద్యం తాగుతుంటే కంటి చూపు పోతోంది..!

బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో నకిలీ మద్యం సేవించి ఇద్దరు వ్యక్తులు మరణించారు.

By Medi Samrat  Published on  24 Sep 2023 2:33 PM GMT
మద్యం తాగుతుంటే కంటి చూపు పోతోంది..!

బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో నకిలీ మద్యం సేవించి ఇద్దరు వ్యక్తులు మరణించారు.మరో ముగ్గురికి కంటి చూపు పోయిందని పోలీసులు తెలిపారు. పోఖారియా పీర్‌లో కొందరి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు వెంటనే విచారణ మొదలుపెట్టారు. బాధితులు రెండు మూడు రోజుల క్రితం కల్తీ మద్యం సేవించినట్లు విచారణలో తేలింది. మద్యం కారణంగా మరణాలు, కంటి చూపు కోల్పోయారు.

బాధితులు ఒకేచోట నుండి వచ్చిన మద్యం సేవించారా లేదా ఇతర ప్రాంతాల దగ్గర నుంచి మద్యం సేవించారా అనే కోణంలో ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కంటి చూపు కోల్పోయిన బాధితుల్లో ఒకరు శివ చంద్ర పాశ్వాన్ అనే వ్యక్తి వద్ద కల్తీ మద్యం సేవించినట్లు తెలిపాడు. శివ చంద్ర పాశ్వాన్ భార్య, కుమార్తెను పోలీసులు విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు. కల్తీ మద్యం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకుని భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు విచారణ జరుపుతున్నామని అధికారులు తెలిపారు. "ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించడంతో ఇద్దరు వ్యక్తులు మరణించినట్లు మాకు సమాచారం అందింది. వారు దేశీ మద్యం సేవించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ మరణాలకు సంబంధించి ఇద్దరిని అరెస్టు చేశాం" అని ముజఫర్‌పూర్ ఎస్పీ అభిషేక్ దీక్షిత్ తెలిపారు.

Next Story