ఉత్తరప్రదేశ్లోని కనౌజ్లో పాఠశాల ఉపాధ్యాయురాలి మందలింపు తట్టుకోలేక 10 ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన స్థానికంగా కలకలం రేపింది. రాంపూర్కు చెందిన ఐదో తరగతి విద్యార్థిని, ఆమె చెల్లెలు శనివారం పాఠశాలకు వెళ్లగా, ఉదయం అసెంబ్లీలో వారి యూనిఫాం అపరిశుభ్రంగా ఉందనే కారణంతో ఒక మహిళా ఉపాధ్యాయురాలు అందరిముందు తీవ్రంగా మందలించారు.
దీంతో అవమాన భారంతో వెక్కి వెక్కి ఏడుస్తూ ఇంటికి వెళ్లిన ఆ అక్కాచెల్లెళ్లు జరిగిన విషయాన్ని తల్లికి వివరించారు. మనస్తాపానికి గురైన పెద్దమ్మాయి కొద్దిసేపటికే ఇంట్లో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఈ వార్త తెలియడంతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు, గ్రామస్థులు బాలిక మృతదేహంతో పాఠశాలను ముట్టడించి భారీ ఎత్తున నిరసన చేపట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఎస్డీఎం, విద్యాశాఖాధికారులు అక్కడికి చేరుకుని బాధితులను శాంతింపజేశారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు సదరు మహిళా ఉపాధ్యాయురాలు, పాఠశాల ప్రిన్సిపాల్తో పాటు మరో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.