ఆస్ప‌త్రిలో అగ్నిప్ర‌మాదం.. 10 మంది చిన్నారుల మృతి

10 C‌hildren die after massive fire breaks at bhandara hospatal.మహారాష్ట్రలో ఘోర అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో 10 మంది చిన్నారుల మృతి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 Jan 2021 4:31 AM GMT
Bhandara Hospital

మహారాష్ట్రలో ఘోర అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో 10 మంది శిశువులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘ‌ట‌న భండారా జిల్లా ప్ర‌భుత్వాసుప‌త్రిలో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే.. ఇక్కడి నాలుగు అంతస్తుల ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఐసీయూ విభాగంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆసుపత్రిలోని ప్రత్యేక నవజాత శిశువుల సంరక్షణ కేంద్రం (ఎస్ఎన్‌సీయూ)లో చికిత్స పొందుతున్న 17 మంది చిన్నారుల్లో 10 మంది చిన్నారులు మృత్యువాత పడ్డారు. మిగతా ఏడుగురిని అధికారులు రక్షించారు. చ‌నిపోయిన వారి వ‌య‌స్సు ఒక నెల నుంచి మూడు నెల‌ల మ‌ధ్య లోపు వ‌య‌స్సు ఉన్న చిన్నారులే కావ‌డం గ‌మ‌నార్హం.


ఏడుగురు చిన్నారులను రక్షించామని, పదిమంది చనిపోయారని జిల్లా సివిల్ సర్జన్ ప్రమోద్ ఖండాటే తెలిపారు. నవజాత శిశువుల యూనిట్‌లో పొగ రావడాన్ని తొలుత ఓ నర్సు గుర్తించినట్టు చెప్పారు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారని చెప్పారు. మంటలు ఎలా అంటుకున్నాయన్న దానిపై స్పష్టత లేదు. అయితే, షార్ట్‌సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్టు భావిస్తున్నారు.

ఈ ఘ‌ట‌న‌పై ప్ర‌ధాన న‌రేంద్ర మోదీ తీవ్ర విచారం వ్య‌క్తం చేశారు. ఎంతో విలువైన చిన్నారుల్ని కోల్పోయామ‌ని ఆవేదన చెందారు. గాయ‌ప‌డిన వారు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్థించారు. కేంద్ర‌హోంశాఖ మంత్రి అమిత్ షా సైతం ఈ దుర్ఘ‌ట‌న‌పై తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. బాధిత కుటుంబాల‌కు ప్ర‌గాడ సానుభూతి ప్ర‌క‌టించారు.



Next Story