హైదరాబాద్లో భారీగా తగ్గిన క్రైమ్ రేటు
By సుభాష్ Published on 7 Oct 2020 4:17 PM IST
గత ఏడాదితో పోల్చుకుంటే హైదరాబాద్లో ఈ ఏడాది మహిళలపై నేరాలు 49 శాతం తగ్గాయని హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. ఇక గ్యాంబ్లింగ్ కేసులు పెరుగుతున్నాయని అన్నారు. 2019 జనవరి నుంచి సెప్టెంబర్ వరకు మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులు 2,611 నమోదు కాగా, 2020 జనవరి నుంచి సెప్టెంబర్ వరకు 1,322 కేసులు నమోదైనట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం నగరంలో 3.3 లక్షల సీసీవీటి కెమెరాలు ఉన్నాయని, వీటిలో 5 లక్షలకు పెంచనున్నట్లు వెల్లడించారు.
ఈ ప్రక్రియ ద్వారా నేరాలు తగ్గడానికి సంఖ్య తగ్గే అవకాశం ఉందని అన్నారు. హత్య కేసులు గత ఏడాది సెప్టెంబర్ వరకు 84 నమోదు కాగా, ఈ ఏడాది సెప్టెంబర్ వరకు 43 కేసులకు తగ్గాయని అన్నారు. హత్యలకు ప్రయత్నించిన కేసులు గత ఏడాది సెప్టెంబర్ వరకు 202 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 88కి తగ్గాయన్నారు. ఇదే క్రమంలో కిడ్నాప్ కేసులు గత ఏడాది సెప్టెంబర్ వరకు 522 నమోదు కాగా, ఈ ఏడాది 309కి పడిపోయినట్లు చెప్పారు.