భారత్‌లో మరణమృదంగం.. 24 గంటల్లో 1,129 మంది మృతి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 July 2020 4:54 AM GMT
భారత్‌లో మరణమృదంగం.. 24 గంటల్లో 1,129 మంది మృతి

భారత్‌లో కరోనా విలయతాండవం చేస్తోంది. గడిచిన 24 గంటల్లో 1,129 మంది మృత్యువాత పడగా.. 45,270 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. భారత్‌లో కరోనా వ్యాప్తి మొదలైన తరువాత ఒక రోజు వ్యవధిలో ఇన్ని కేసులు, మరణాలు నమోదు కావడం ఇదే తొలిసారి. వీటితో కలిపి దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 12,38,635కి చేరింది. ఈ మహమ్మారి భారీన పడి ఇప్పటి వరకు 29,861 మంది మృత్యువాత పడ్డారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

మొత్తం నమోదు అయిన కేసుల్లో 7,82,607 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. 4,26,167 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దేశంలో కరోనా రికవరీ రేటు 63.13శాతంగా ఉంది. నిన్నటి వరకు మొత్తం 1,50,75,369 శాంపిళ్లను పరీక్షించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులో 3,50,823 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

దేశంలో అత్యధిక కరోనా కేసులు మహారాష్ట్రలో నమోదు అవుతున్నాయి. ఇప్పటి వరకు అక్కడ 3.2లక్షల కేసులు నమోదు కాగా.. 12,276 మంది మరణించారు. తమిళనాడులో 1.81లక్షల కేసులు నమోదు కాగా.. 2,626 మంది ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీలో 1.25లక్షల కేసులు నమోదు కాగా.. 3,690 మంది మరణించారు. ప్రపంచంలో అత్యధిక కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్న దేశాల్లో భారత్‌ మూడో స్థానంలో ఉంది. భారత్‌ కంటే ముందు అమెరికా, బ్రెజిల్‌ ఉన్నాయి. ఇక అత్యధిక మరణాలు నమోదు అవుతున్న దేశాల్క్ష భారత్‌ ఏడో స్థానంలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

Next Story