ఆ జర్నలిస్టు చనిపోయాడు.. న్యాయం జరిగేనా..!  

By సుభాష్  Published on  22 July 2020 8:09 AM GMT
ఆ జర్నలిస్టు చనిపోయాడు.. న్యాయం జరిగేనా..!  

జర్నలిస్టును కూతుళ్ల ముందే కాల్చిన ఘటన ఘజియాబాద్ లో చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. జర్నలిస్ట్ విక్రమ్ జోషి తన ఇద్దరు కుమార్తెలతో కలిసి వెళుతుండగా కొందరు అడ్డుగా వచ్చారు. తమ దగ్గర ఉన్న తుపాకీతో విక్రమ్ జోషి మీద కాల్పులు జరిపారు. ఈ ఘటనలో విక్రమ్ జోషి తలపై తూటా దూసుకువెళ్లింది. అతన్ని హుటాహుటిన నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

ఈ ఘటనపై పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంటూ వుంది ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం. కొద్దిరోజుల కిందట విక్రమ్ జోషి తన మేనకోడలిని కొందరు వేధిస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఈ విషయంపై పెద్దగా పట్టించుకోలేదు. ఇంతలో కొందరు విక్రమ్ జోషిపై దాడి చేయడంతో అతడు ఆసుపత్రిలో మరణించాడు. ఆయన మరణంపై జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లో జర్నలిస్టులపై పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నా కనీసం పట్టించుకోవడం లేదని ఆరోపణలు చేశారు. రోడ్డు మీద బైఠాయించి జర్నలిస్టులు నిరసన తెలిపారు. విక్రమ్ జోషి మరణాన్ని యూపీ ప్రభుత్వం ఖండించింది. అతడి కుటుంబానికి 10 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియాను ప్రకటించింది.

ఈ ఘటనలో మొత్తం తొమ్మిది మందిని పోలీసులు అదుపు లోకి తీసుకున్నారు. రవి, చోటు అనే ఇద్దరు ప్రధాన నిందితులు అని పోలీసులు చెబుతున్నారు. తుపాకీని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇంకొక వ్యక్తి పరారీలో ఉన్నాడు. ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేశారు.

ఘజియాబాద్ లోని విజయ్ నగర్ ప్రాంతంలో సోమవారం నాడు జోషి మీద దాడి జరిగిన ఘటన చోటుచేసుకుంది. అక్కడి సిసిటివి కెమెరాల్లో ఈ ఘటన రికార్డు అయ్యింది. జోషి తన ఇద్దరు కుమార్తెలతో కలిసి వెళుతుండగా బండి అదుపు తప్పి పడిపోయింది. వెంటనే కొందరు అతడి మీద పడి దాడి చేయడం మొదలుపెట్టారు. అతడి ఇద్దరు కుమార్తెలు బైక్ కింద పడిపోగానే పారిపోవడం సిసిటివి కెమెరాలో రికార్డు అయ్యింది. ఓ కారు దగ్గరకు అతన్ని లాక్కుని వెళ్లి.. కొద్ది సేపు కొట్టిన అనంతరం అక్కడి నుండి వెళ్లిపోయారు.

విక్రమ్ జోషి రోడ్డు మీద పడి ఉండగా.. పెద్ద కుమార్తె అతడి దగ్గరకు వచ్చింది. ఎవరైనా సహాయం చేయండి అంటూ గట్టిగా అరవడం మొదలుపెట్టింది. రోడ్డు మీదనే తన తండ్రి పక్కన కూర్చున్న అమ్మాయి ఎవరైనా సహాయం చేస్తారేమోనని ఎదురుచూడడం మొదలుపెట్టింది. ఇంతలో కొందరు వచ్చి అతడిని ఆసుపత్రికి తీసుకుని వెళ్ళడానికి సహాయం చేశారు. ఈ ఘటన రాత్రి 10:30 సమయంలో చోటుచేసుకుంది.

Next Story