భార‌త్‌లో 500 మ‌ర‌ణాలు.. 15వేల కేసులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 April 2020 6:02 AM GMT
భార‌త్‌లో 500 మ‌ర‌ణాలు.. 15వేల కేసులు

క‌రోనా వైర‌స్ ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోంది. ఇక భార‌త్‌లోనూ క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తోంది. రోజు రోజుకు దేశంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ ఉంది. గ‌డిచిన 24 గంట‌ల్లో దేశ వ్యాప్తంగా 1,334 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా.. 27 మంది మృత్యువాత ప‌డ్డారు. దీంతో మొత్తంగా దేశంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 15,712 కు చేరంది. ఇక ఈ మ‌హ‌మ్మారి భారీన ప‌డి మృతి చెందిన వారి సంఖ్య 507కు చేరింది. మొత్తం బాధితుల్లో 2,231 మంది కోలుకోగా.. 12,974 మంది ఆస్ప‌త్రుల్లో చికిత్స తీసుకుంటున్నార‌ని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది.

క‌రోనా పాజిటివ్ అత్య‌ధికంగా మ‌హారాష్ట్ర‌లో న‌మోద‌వుతున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో రాష్ట్ర వ్యాప్తంగా 328 కొత్త కేసులు న‌మోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,651 చేర‌గా.. 211 మంది మృతి చెందారు. ఇక దేశ రాజ‌ధాని ఢిల్లీలో ఈ మ‌హ‌మ్మారి విజృంభిస్తోంది. నిన్న ఒక్క రోజే 186 కేసులు న‌మోదు కాగా.. మొత్తం కేసుల సంఖ్య 1,893కి చేరింది. 42 మంది మ‌ర‌ణించారు. మ‌ధ్య ప్ర‌దేశ్‌లో 1,407 క‌రోనా కేసులు న‌మోదు కాగా.. 70 మంది మృత్యువాత ప‌డ్డారు.తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ మ‌హ‌మ్మారి త‌న ప్ర‌తాపాన్ని చూపిస్తోంది. తెలంగాణ‌లో 809 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా.. 18 మంది మృత్యువాత ప‌డ్డారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో 603 కేసులు న‌మోదు కాగా.. 17 మంది మ‌ర‌ణించారు.

Next Story