మార్చి తర్వాతే వ్యాక్సిన్‌: భారత్‌ బయోటెక్‌

By సుభాష్  Published on  1 Nov 2020 10:59 AM GMT
మార్చి తర్వాతే వ్యాక్సిన్‌: భారత్‌ బయోటెక్‌

భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ను వచ్చే ఏడాది లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. పలు సంస్థల నుంచి అనుమతులు వచ్చాకే వ్యాక్సిన్‌ విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌పైనే దృష్టి సారించినట్లు భారత్‌ బయోటెక్‌ స్పష్టం చేసింది. ఐసీఎంఆర్‌, నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ భాగస్వామ్యంతో భారత్‌ బయోటెక్‌ కొవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తోంది. తుది దశ క్లినికల్‌ ట్రయల్స్‌లో విజయం సాధించి, నియంత్రణ సంస్థల అనుమతులు పొందిన తర్వాతే వ్యాక్సిన్‌ విడుదల చేస్తామని భారత్‌ బయోటెక్‌ అంతర్జాతీయ వ్యవహారాల డైరెక్టర్‌ సాయి ప్రసాద్‌ పేర్కొన్నారు.

దీంతో వచ్చే ఏడాది 2021 మార్చి తర్వాత అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఉన్నట్లు చెప్పారు. అయితే కొవాగ్జిన్‌ మూడో దశ ప్రయోగాల కోసం డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా నుంచి భారత్‌ బయోటెక్‌ అ మధ్యనే అనుమతి పొందినట్లు చెప్పారు. వాలంటీర్ల ఎంపిక, వ్యాక్సిన్‌ ప్రయోగాలను ఈనెలలోనే ప్రారంభించే ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. దీని కోసం దేశంలోని 13-14 రాష్ట్రాల్లో దాదాపు 25 నుంచి 30 ప్రాంతాల్లో ఈ ప్రయోగాలు జరిపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇలా ప్రతి ఆస్పత్రి నుంచి దాదాపు 2 వేలమంది వాలంటీర్లను నమోదు చేసుకునే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ఈ ప్రయోగాల్లో వాలంటీర్లకు రెండు డోసుల వ్యాక్సిన్‌ ఇవ్వనున్నారు.

వ్యాక్సిన్‌ అభివృద్ధి కోసం రూ.350 కోట్లపైనే..

ప్రయోగాలలో భాగంగా వచ్చే ఆరు నెలల్లో వ్యాక్సిన్ అభివృ ద్ధి, కావాల్సిన సదుపాయాల కోసం దాదాపు రూ.350 కోట్ల నుంచి రూ.400 కోట్ల వరకు ఖర్చు చేయనున్నట్లు భారత్‌ బయోటెక్‌ వెల్లడించింది.

వ్యాక్సిన్‌ వచ్చాక ప్రభుత్వ, ప్రైవేటు మార్కెట్‌లోకి..

కాగా, వ్యాక్సిన్‌ ట్రయల్స్‌ తుదిదశ పూర్తయిన తర్వాత ప్రభుత్వ, ప్రైవేటు మార్కెట్లకు సరఫరా చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపింది. అంతేకాకుండా వ్యాక్సిన్‌ను విదేశాల్లోనూ మార్కెట్‌ చేసే అవకాశాలపై ప్రాథమిక చర్చలు కొనసాగుతున్నట్లు తెలిపింది. అయితే వ్యాక్సిన్‌ ధర ఎంత అనేది ఇంకా నిర్ణయించలేదని తెలిపింది. ప్రస్తుతం తమ దృష్టి అంతా మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌పైనే ఉన్నట్లు తెలిపారు.

Next Story