డీసీపీపై దాడి చేసిన 500 మంది కానిస్టేబుళ్లు.. ఎందుకంటే..
By న్యూస్మీటర్ తెలుగు Published on 21 May 2020 8:24 AM GMTదాదాపు 500 మంది కానిస్టేబుళ్లు కలిసి ఓ డీసీపీపై దాడి చేసిన ఘటన పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో చోటుచేసుకుంది. వివరాళ్లోకెళితే.. కరోనా నేఫథ్యంలో తమ సమస్యలు చెప్పుకోవడానికి 500 మంది కానిస్టేబుళ్లు డీసీపీ ఇంటికి వెళ్లారు. అక్కడ ఆయనతో కలిసి చర్చలు జరిపారు. ఈ క్రమంలో ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయిన కానిస్టేబుళ్లు.. డీసీపీపై దాడికి దిగారు. దీంతో డీసీపీ ప్రాణ భయంతో పరుగులు తీసారు. సినిమాను తలపిస్తున్న ఈ సీన్ మంగళవారం రాత్రి జరిగింది.
అంఫన్ తుఫాన్ సహాయక చర్యల కోసం 500 మంది కానిస్టేబుళ్లకు డ్యూటీ వేశారు. కానిస్టేబుళ్ల బ్యారక్లో ఉన్న ఓ కానిస్టేబుల్కి కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే.. ఉన్నతాధికారులు ఆ ప్రాంతంలో ఎటువంటి భద్రతా ప్రమాణాలు పాటించకుండా నిర్లక్ష్యం వహించారు. దీంతో కానిస్టేబుళ్లు.. డీసీపీ ఉంటున్న నివాసం వద్దకు వెళ్లి నిరసన తెలిపారు.
దీంతో.. డీసీపీ పాల్ బయటకు వచ్చి కానిస్టేబుళ్లను వారించే ప్రయత్నం చేశారు. ఇలా చర్చలు జరుగుతున్న క్రమంలోనే.. కానిస్టేబుళ్లు ఆగ్రహంతో డీసీపీపైకి దాడికి దిగారు. కంటైన్మెంట్ జోన్లలో పని చేస్తున్నా సరిపడా మాస్కులు ఇవ్వడం లేదని.. ఉంటున్న ప్రాంతంలో శానిటైజేషన్ చేయడం లేదంటూ ఆగ్రహంతో డీసీపీపై దాడికి దిగారు. కాగా.. ఘటనా స్థలంలో ఉన్న కొంతమంది పోలీసులు డీసీపీని రక్షించి.. దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. కాగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బుధవారం సంఘటనా స్థలాన్ని సందర్శించి కానిస్టేబుళ్లతో చర్చించారు.