మూడో విడత 'కంటి వెలుగు'.. అవ్వాతాతలకు ఎంత చేసిన తక్కువే..
By అంజి Published on 18 Feb 2020 8:25 AM GMTకర్నూలులో మూడవ దశ కంటివెలుగు కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. అనంతరం నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా హెల్త్ సబ్ సెంటర్ల నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్ ప్రసంగించారు. పేద వారు ఆస్పత్రికి వెళితే డాక్టర్లు లేరనే పరిస్థితి రాకూడదని సీఎం జగన్ అన్నారు. మీ బిడ్డగా చేతనైనంత సాయం చేస్తున్నానని అన్న ఆయన.. వృద్ధులకు ఎంత చేసిన తక్కువే అవుతుందన్నారు.
కర్నూలు నుంచి రెండు కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు. ఆస్పత్రుల రూపు రేఖలు మార్చేందుకు నాడు-నేడు కార్యక్రమం ప్రారంభిస్తున్నామని, అవ్వ, తాతల కోసం వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభిస్తున్నామని అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దుతామని, వాలంటీర్ల ద్వారా కళ్లజోళ్లను పంపిణీ చేస్తామని సీఎం జగన్ పేర్కొన్నారు. మూడు దశల్లో చేపట్టే నాడు-నేడు కార్యక్రమంలో రూ.15,337 కోట్లతో ఆస్పత్రుల రూపురేఖలు మారుస్తామన్నారు. దీంతో 1,445 పీహెచ్సీల రూపురేఖలు మారనున్నట్లు సీఎం జగన్ తెలిపారు. 149 కొత్త పీహెచ్సీలు ఏర్పాటు చేయబోతున్నామని, రూ. 700 కోట్లతో 52 ఏరియా ఆస్పత్రులను ఆధునీకరించబోతున్నామని అన్నారు.
కొత్తగా 16 మెడికల్ కాలేజీలు, 16 కొత్త నర్సింగ్ కాలేజీలు నిర్మించబోతున్నట్లు సీఎం జగన్ తెలిపారు. గత ప్రభుత్వం అవ్వ, తాతల ఆరోగ్యాన్ని పట్టించుకోలేదన్నారు. గ్రామ సచివాలయాల్లోనే అవ్వ, తాతలకు కంటి పరీక్షలు చేస్తున్నామన్నారు. మార్చి 1 నుంచి అవసరమైన వారికి కంటి ఆపరేషన్లు ప్రారంభిస్తామన్నారు.