నేడు ‘వైఎస్సార్‌ కాపు నేస్తం’ ప్రారంభం

By సుభాష్  Published on  24 Jun 2020 1:55 AM GMT
నేడు ‘వైఎస్సార్‌ కాపు నేస్తం’ ప్రారంభం

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ప్రజాసంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఏడాదిలోనే ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు. అధికారులను, ఎమ్మెల్యేలు, మంత్రులను ఊరుకులు పరుగులు పెట్టించి ప్రజలకు మరింత చేరువవుతున్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో సైతం కొత్త కొత్త పథకాలను ప్రవేశపెడుతూ ముందుకు సాగుతున్నారు. కరోనాతో రాష్ట్రం ఆర్థికంగా కుంగిపోతున్నా.. ప్రజల కోసం సరికొత్త పథకాలను సైతం అమలు చేస్తున్నారు.

తాజాగా మహిళల కోసం మరో వినూత్న పథకాన్ని అమలు చేయబోతున్నారు. బుధవారం ‘వైఎస్సార్‌ కాపు నేస్తం’ పథకాన్ని సీఎం జగన్‌ ప్రారంభించనున్నారు. ఈ పథకం ద్వారా అర్హులైన కాపు మహిళలకు యేటా రూ.15వేల చొప్పున ఐదేళ్లలో మొత్తం రూ.75వేల ఆర్థిక సాయం అందనుంది. తొలి ఏడాది దాదాపు 2.36 లక్షల మహిళలకు ఈ పథకం ద్వారా లబ్ది చేకూరనుంది. నేరుగా వారి వారి ఖాతాల్లో రూ.15వల చొప్పున జమ చేస్తారు. ఈ పథకం కింద ఈ ఏడాది రూ.353.81 కోట్లు ఖర్చు చేయనుంది.

♦ ఈ పథకం కాపు, బలిజ, తెగ, ఒంటరి కులాలకు చెందిన మహిళల్లో 45 నుంచి 60 సంవత్సరాలున్న వారికి మాత్రమే ఈ పథకం వర్తించనుంది.

♦ ఈ పథకంలో అర్హులు కావాలంటే కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.20 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో అయితే రూ.1.44 లక్షలు మించకూడదు.

♦ ఆ కుటుంబానికి 3 ఎకరాలలోపు తరి లేదా పది ఎకరాల మెట్ట భూమి ఉండాలి. రెండు కలిపి పది ఎకరాల్లోపు ఉండాలి. అదే పట్టణ ప్రాంతాల్లో ఉన్నవారికి ఎలాంటి ఆస్తి లేదా 750 చదరపు అడుగులకు మించిన ఇల్లు లేదా ఇతర ఏ నిర్మాణాలు ఉండరాదు.

♦ ప్రభుత్వ ఉద్యోగి ఉండరాదు. ప్రభుత్వ పెన్షన్‌ కూడా పొందరాదు. అలాగే నాలుగు చక్రాల వాహనం ఉండరాదు. ఇక ఆటో, ట్యాక్సీ, ట్రాక్టర్‌కు మినహాయింపు ఇచ్చారు.

♦ ఈ ‘వైఎస్సార్‌ కాపు నేస్తం’ పథకం లబ్దిదారుల ఎంపిక పాదర్శకంగా జరుగుతుందని ప్రభుత్వం తెలిపింది.

Next Story