వీరి ఆచూకీ చెప్పండి.. వివరాలు గోప్యంగా ఉంచుతాం
By సుభాష్ Published on 26 Dec 2019 11:50 AM GMTపౌరసత్వ సవరణ బిల్లుపై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం ఎగిసిపడుతున్న విషయం తెలిసిందే. ఈ అల్లర్లు, హింసాత్మక ఘటనలలో ప్రభుత్వ ఆస్తులు భారీ మొత్తంలో ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ కఠిన చర్యలు చేపట్టాలని ఇప్పటికే పోలీసులను అదేశించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నిరసన, హింసాత్మక ఘటనలకు పాల్పడిన వ్యక్తుల ఫోటోలను ఉత్తర ప్రదేశ్ పోలీసులు గురువారం విడుదల చేశారు. ఈ సంరద్భంగా నిందితుల ఆచూకీ తెలిపిన వారికి రివార్డుకూడా ప్రకటించారు. అలాగే ఆచూకీ తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు వారి ఫోటోలను ఫేస్ బుక్, వాట్సాప్, ట్విట్టర్లలో పోస్టు చేశారు.
ఉత్తరప్రదేశ్లో ఇప్పటి వరకు దాదాపు 17 మంది వరకు మృతి చెందారు. మొత్తం 213కేసులు నమోదు కాగా,అందులో 925 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు ప్రకటించారు.కాగా, మవు జిల్లాలో సోమవారం జరిగిన హింసాత్మక ఘటనలో 110 మంది నిందితుల ఫోటోలను విడుదల చేశారు. నిందితుల ఫోటోలన్నీ సీసీ కెమెరాలు, మీడియా నుంచి సేకరించామని పోలీసులు వివరించారు.
ఈ నేపథ్యంలో ప్రజా ఆస్తులను ధ్వంసం చేసిన అంశాలలో మూడు ఎఫ్ఐఆర్ దాఖలు చేశామని, 21 మందిని అరెస్టు కూడా చేసినట్లు చెప్పారు. ఇక కార్పూర్లో అల్లర్లకు పాల్పడిన 48 మంది నిందితులతోకూడిన పోస్టర్ను విడుదల చేశారు. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా,11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిపై 17ఎఫ్ఐఆర్ కేసులు నమోదు చేయగా,24 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు వివరించారు. ఈ ముగ్గురిపై కూడా రూ.25వేల చొప్పున రివార్డు కూడా ప్రకటించారు పోలీసులు. ఇక అన్ని ప్రాంతాల్లోజరిగిన అల్లర్లపై నిందితుల ఫోటోలను విడుదల చేశామని వెల్లడించారు.