చైనాలో ఘోర రైలు ప్రమాదం.. 127 మంది..
By సుభాష్
కరోనా వైరస్తో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న చైనా దేశంలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. పట్టాలపై ఉన్న రాళ్లను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, 127 మందికి గాయాలయ్యాయి ఈ రైలు ప్రమాదం చైనాలోని హునాన్ ప్రావిన్స్లో సోమవారం చోటు చేసుకుంది. ఈ రైలు చెంజో సిటీ నుంచి గాంగ్జోకు వెళ్తుండగా.. పట్టాలపై కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో గమనించిన లోకో పైలట్ వెంటనే అత్యవసర బ్రేక్ వేశాడు. అప్పటికి వేగంగా ఉన్న రైలు పట్టాలపై పడివున్న రాళ్లను ఢీకొట్టింది. దీంతో ఐదు బోగీలు పట్టాలు తప్పి పడిపోయాయి. రాళ్లను ఢీకొట్టిన వెంటనే ఇంజన్లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి.
ప్రమాద విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన 127 మందిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళన చెందారు. ముందే కరోనా మహమ్మారితో అతలాకుతలం అయిన చైనాలో రైళ్లన్ని రద్దు అయి తిరిగి ప్రారంభం అయ్యాయి. కరోనా వైరస్ నుంచి పూర్తి స్థాయిలో కోలుకోకముందే రైలు ప్రమాదం జరగడం మరింత ఆందోళన కలిగిస్తోంది.