విశాఖ ఎయిర్పోర్టు వద్ద ఉద్రిక్తత.. చంద్రబాబు గోబ్యాక్ అంటూ..
By అంజి Published on 27 Feb 2020 11:01 AM IST
విశాఖ: టీడీపీ అధినేత చంద్రబాబు ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో విశాఖ ఎయిర్పోర్టు వద్ద పోలీసులు భారీగా మోహరించారు. చంద్రబాబు రాక నేపథ్యంలో ఎయిర్పోర్టు వద్దకు టీడీపీ, వైసీపీ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. పోటా పోటీ నినాదాలో ఎయిర్పోర్టు పరిసరాలు హోరెత్తాయి. చంద్రబాబు గో బ్యాక్ అంటూ వైసీపీ శ్రేణులు నినాదాలు చేశారు.
ఎయిర్పోర్టు రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేస్తున్న వారిని అడ్డుకొని పోలీసులు వెనక్కి పంపారు. వైసీపీ నేతలు ఇచ్చిన పిలుపు మేరకు వైసీపీ కార్యకర్తుల పెద్ద ఎయిర్పోర్టు వద్ద తమ నిరసనను తెలియజేశారు. మరో వైపు తమను ఎయిర్పోర్టులోకి అనుమతించాలంటూ టీడీపీ శ్రేణులు నినాదాలు చేస్తున్నారు. ఎయిర్పోర్టులోకి దూసుకెళ్లేందుకు ఇరువర్గాలు యత్నించారు. దీంతో ప్రవేశమార్గం దగ్గర వారికి పోలీసులు అడ్డుకున్నారు.
వైసీపీ, టీడీపీ కార్యకర్తలు భారీగా చేరుకోవడంతో ఎయిర్పోర్టు పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాపిక్ జామ్ అయ్యింది. దీంతో విమాన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాగా ఎయిర్పోర్టు పరిసర ప్రాంతాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. విశాఖలో టీడీపీ అధినేత చంద్రబాబు నిర్వహించనున్న ర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. చంద్రబాబు విజయనగరం జిల్లాలో ప్రజాచైతన్య యాత్రలో పాల్గొననున్నారు.