జగన్‌ సర్కార్‌పై నిప్పులు చెరిగిన చంద్రబాబు

By సుభాష్  Published on  5 May 2020 1:51 PM GMT
జగన్‌ సర్కార్‌పై నిప్పులు చెరిగిన చంద్రబాబు

ఏపీలో రాజకీయాలు ఎప్పుడూ వాడి వేడిగా ఉంటాయి. ప్రతీ రోజు నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు, ఆరోపణలు చేసుకోనిదే రోజు గడవదు. అయితే తాజాగా లాక్ డౌన్ లో కొన్ని సడలింపులు ఇవ్వడంతో ఏపీలో మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. ఇక మద్యం షాపులు తెరుచుకోవడంపై ఏపీ టీడీపీ నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జగన్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇష్టానుసారంగా మద్యం దుకాణాలు తెరిచారని, ఇదేమని ఎవరైన ప్రశ్నిస్తే ఎదురుదాడికి దిగుతున్నారని ఆరోపించారు. చదువు చెప్పే టీచర్లను మద్యం షాపులో పెడతారా..? అంటూ ప్రశ్నించారు. చట్టాన్ని గౌరవించాలని నేను హైదరాబాద్ లోనే ఉండిపోయానని, నాపై లేనిపోని విమర్శలు చేశారని చంద్రబాబు మండిపడ్డారు. మద్యం దుకాణాల వద్ద మహిళలు ఆందోళన చేశారని, రేట్లు పెంచితే మద్యపాన నిషేధం జరుగుతుందని చెప్పి ఈ రోజు 50 శాతం రేట్లు పెంచారని అన్నారు.

మీకు నచ్చిన బ్రాండ్లు మాత్రమే పెడతారా..? లేదంటే జేట్యాక్స్ కోసం నాసిరకం బ్రాండ్లను అనుమతిస్తారా..? అంటూ ఆరోపించారు. మద్యపాన నిషేధం చేయాలంటే ఇంతకంటే సమయం ఏముందని అన్నారు.

తొందరపడి మద్యం షాపులు ఎందుకు తెరిచారని ప్రభుత్వాన్ని నిలదీశారు. సర్కార్ తీరుతో రాష్ట్ర ప్రజలు చితికిపోయారని ధ్వజమెత్తారు.

Next Story