మారటోరియం : వడ్డీపై వడ్డీ మాఫీ చేస్తాం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  3 Oct 2020 7:38 AM GMT
మారటోరియం : వడ్డీపై వడ్డీ మాఫీ చేస్తాం

కరోనా వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ కారణంగా తలెత్తిన సంక్షోభం వల్ల బ్యాంకు రుణాలపై ఆరు నెలల పాటు మారటోరియం విధించిన విషయం తెలిసిందే. అయితే, మారటోరియం విధించిన స‌మ‌యంలోనూ వడ్డీపై వడ్డీ ఉండడంతో దాన్ని మాఫీ చేయాలని వచ్చిన పిటిషన్‌లను సుప్రీంకోర్టు విచారిస్తోంది.

ఈ సందర్భంగా తాజాగా కేంద్ర సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. వడ్డీపై వడ్డీని మాఫీ చేయాలని నిర్ణయం తీసుకుని ఈ విషయాన్ని సుప్రీంకోర్టుకు తెలిపింది. మార్చి నుండి ఆగస్టు మధ్యకాలంలో వ‌డ్డీలు చెల్లించిన వారికి సైతం ఈ లబ్ధి చేకూర‌నుంది. వడ్డీపై వడ్డీని మాఫీ చేయడం వల్ల ప్రజలపై పడే భారాన్ని భరించాలని ప్రభుత్వం నిర్ణయించిందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో తెలిపింది.

కాగా, కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం వల్ల రూ. 2 కోట్ల వరకు ఎంఎస్ఎంఈ, వ్యక్తిగత రుణాలతో పాటు విద్య, గృహ, వినియోగదారుల రుణాలు, క్రెడిట్ కార్డ్ బకాయిలు, ఆటో రుణాలు వంటి అన్నింటిపై వడ్డీపై వడ్డీ మాఫీ అవుతుందని స్పష్టం చేసింది.

అయితే.. మారిటోరియం విధించినప్పటికీ పలు బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు అస‌లు, వ‌డ్డీకి క‌లిపి వడ్డీ వసూలు చేస్తున్నాయి. దీంతో రుణాలు తీసుకున్న వారిపై అధిక మొత్తంలో భారం పడుతోంది. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం రుణగ్ర‌హిత‌ల‌కు ఉపశమనం కలిగించేలా ఉంది.

Next Story