సీఎం జగన్‌కు ఊరట లభించేనా.?

By సుభాష్  Published on  19 Jan 2020 11:56 AM GMT
సీఎం జగన్‌కు ఊరట లభించేనా.?

కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు కొత్త సీబీఐ జాయింట్ డైరెక్టర్ ను నియమించినట్లు ఊహాగానాలు మొదలయ్యాయి. కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్‌ సీబీఐ జేడీగా నియమిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం కేంద్ర ప్రభుత్వం త్వరలో అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం. ఇక కొత్తగా వచ్చే జేడీ ముఖ్యమంత్రి జగన్‌ ఆస్తుల కేసును పర్యవేక్షించనున్నారు. కాగా, ఏపీకి చెందిన వ్యక్తిని కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తిని సీబీఐ జాయింట్‌ డైరెక్టర్‌గా నియమించాలని ఇటీవల వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు సమాచారం.

జగన్‌కు ఊరట లభించేనా..?

ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అనుకున్నట్లుగానే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన వ్యక్తిని కాకుండా ఇతర రాష్ట్రానికి చెందిన వ్యక్తిని నియమిస్తే సీఎం జగన్‌కు ఊరట లభించినట్లేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా, ముఖ్యమంత్రి జగన్‌ త్వరలో జైలుకు వెళ్లడం ఖాయమని సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న నేపథ్యంలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. సోషల్‌ మీడియాలో ఎవరి అభిప్రాయం వారు వ్యక్తం చేస్తుంటారని, జగన్‌ కేసు విషయంలో చట్టం తనపని తాను చేసుకుపోతుందని పేర్కొన్నారు. ప్రతి కేసులో సాక్ష్యాలు, ఆధారాలు సేకరించడం ..వాటిని కోర్టుకు సమర్పించడం లాంటివి జరిగిన తర్వాత కోర్టు తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని వ్యాఖ్యనించారు. తాను సీబీఐ జేడీగా ఉన్నప్పుడు విచారణ చేసిన సమయంలో దాఖలు చేసిన ఛార్జిషీటు ప్రకారం ఆధారాలను కోర్టులో సమర్పించానని అన్నారు.

కోర్టు హాజరుపై జగన్‌కు మినహాయింపు వస్తుందా..?

ఇక అక్రమాస్తుల విషయంలో ప్రతి శుక్రవారం జగన్‌ హాజరుకావల్సిందేనని కోర్టు తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నతనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని జగన్‌ కోరుతూ వచ్చారు. అయినా కోర్టు ఎలాంటి మినహాయింపు ఇవ్వకుండా ప్రతి శుక్రవారం హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది. ఇక కొత్త సీబీఐ జేడీగా వచ్చిన తర్వాత జగన్‌కు కాస్త ఊరట లభిస్తుందని తెలుస్తోంది.

ఏపీకి ప్రత్యేక సీబీఐ విభాగం ఉండదు

ఏపీకి ప్రత్యేక విభాగం ఉండదు. హైదరాబాద్‌ సీఐబీ కార్యాలయమే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల కేసులను చూస్తుంది. మొత్తం మీద కొత్తగా నియామకమైన సీబీఐ జేడీ వల్ల సీఎం జగన్‌కు ఎలాంటి ఊరట లభిస్తుందనేది వేచి చూడాల్సిందే.

Next Story