కేంద్ర బ‌డ్జెట్‌ను ఎలా త‌యారు చేస్తారో తెలుసా..?

By సుభాష్  Published on  30 Jan 2020 9:25 AM GMT
కేంద్ర బ‌డ్జెట్‌ను ఎలా త‌యారు చేస్తారో తెలుసా..?

ముఖ్యాంశాలు

► బడ్జెట్‌ లెక్కల్లో ఎన్నో చిక్కులు

► ఎంతో కసరత్తు.. లెక్కకు మించిన భేటీలు

► ఎంతో రహస్యం..చాలా పెద్ద తతంగం

► బడ్జెట్‌ తయారీ వెనక దాగివున్న శ్రమ ఇదే

బడ్జెట్‌ అనగానే చాలామంది లెక్కల చిక్కులే అనుకుంటారు. కానీ ఈ మూడక్షరాల వెనుక చాలా శ్ర‌మ దాగివుంటుంది. ఎంతో కసరత్తు..లెక్కకు మించి భేటీలు.. ఎంతో ర‌హ‌స్యం...అబ్బో చాలా తతంగమే ఉంటుంది. మ‌రీ ఇంత బ‌డ్జెట్‌ను కేంద్ర ప్ర‌భుత్వం ఎలా త‌యారు చేస్తుంది.. ఎలా లెక్క‌లేస్తారు.. ఏ వ‌ర్గానికి ఎంత బ‌డ్జెట్ కేటాయిస్తార‌ని చాలా మందికి వ‌చ్చే అనుమానం. ఆ అనుమాన‌మేంటో తేల్చేద్దాం..!

సెప్టెంబ‌ర్ నెల‌లో..

రానున్న ఆర్థిక సంవత్సరంలో ఏయే రంగానికి ఎంత ఖర్చు పెట్టాలన్న కసరత్తు ప్రారంభ‌మ‌వుతుంది. దేశంలో మొత్తం జనాభా తమ తిండి కోసం ఏడాదికి ఎంత ఖర్చు చేస్తున్నారో దాదాపు అంత మొత్తాన్ని ప్రభుత్వం బడ్జెట్‌కు కేటాయిస్తుంది.

అక్టోబ‌ర్‌లో..

తమకు కావాల్సిన నిధులపై వివిధ మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు ఆర్థిక శాఖతో చర్చలు జరుపుతారు. ఏ శాఖ‌లో ఏ రంగానికి ఎంత నిధులు కేటాయించాల‌నే దానిపై తీవ్రంగా క‌స‌ర‌త్తు చేస్తారు.

డిసెంబర్‌లో..

ముసాయిదా బడ్జెట్‌ కాపీలను అధికారులు ఆర్థికశాఖ మంత్రికి నివేదిస్తారు. ఈ ముసాయిదా పత్రాలన్నీ నీలం రంగులో ఉంటాయి.

జనవరిలో..

పారిశ్రామిక, బ్యాంకింగ్‌ రంగాలకు చెందిన వివిధ సంఘాల ప్రతినిధులు ఆర్థికశాఖ మంత్రిని కలసి తమ సమస్యలు, సలహాలు, సూచనలను అందజేస్తారు. ఈ సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి అందరి వాదనలు వింటారు గానీ ఎవరికీ నిర్దిష్టమైన హామీ ఇవ్వరు. ఎలాంటి స‌మ‌స్య‌లు ఉన్నాయో వివ‌రిస్తారు.

ఫోన్‌ ట్యాపింగ్‌

బడ్జెట్‌ ప్రతిపాదనలు ఏమాత్రం బ‌య‌ట‌కు లీక్‌ కాకుండా చూసే బాధ్యతను ఇంటెలిజెన్స్‌ విభాగం చూసుకుంటుంది. ఇందుకు కొందరు ఉన్నతాధికారుల ఫోన్లను సైతం ట్యాప్‌ చేస్తుంటుంది. బ‌డ్జెట్ ప్ర‌తిపాన‌ల‌పై గ‌ట్టి నిఘా ఉంటుంది.

జనవరి నుంచి జర్నలిస్ట్ ల నిషేధం

బడ్జెట్‌కు సంబంధించిన అన్ని వివరాలను అత్యంత రహస్యంగా ఉంచేందుకు జనవరి నుంచి ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయాల్లోకి జర్నలిస్టుల ప్రవేశాన్ని నిషేధిస్తారు. ప‌క‌డ్బంధీ నిఘా ఉంటుంది.

సీసీటీవీల ద్వారా ఎప్ప‌టిక‌ప్పుడు నిఘా

ఆర్థిక శాఖ కార్యాలయానికి వచ్చే సందర్శకులపై సీసీటీవీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు నిఘా ఉంటుంది. ఈ కెమెరాల పరిధిని దాటి వారు కనీసం కుర్చీలపై కూర్చోవడానికి కూడా అనుమతి ఉండదు.

‘ప్రింటింగ్‌ ప్రెస్‌’ల సిబ్బంది ఎవ‌రితో సంబంధం లేకుండా..

బడ్జెట్‌ పత్రాలను తయారు చేసే ‘ప్రింటింగ్‌ ప్రెస్‌’ సిబ్బందికి ఎవరితో సంబంధం లేకుండా నిఘా ఉంటుంది. వీరికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తినా వైద్యులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారు. మొత్తం బ‌డ్జెట్ ప‌త్రాల ప్రింటింగ్ పూర్తయ్యే వ‌ర‌కు ప్ర‌త్యేక నిఘా ఉంటుంది. అలాగే ప్రింటింగ్‌ ప్రెస్‌ సిబ్బందికి అందించే ఆహారంపై అత్యంత జాగ్రత్త తీసుకుంటారు. ఏ ఆహారాన్ని అయినా పరీక్షించిన తర్వాతే వారికి ఇస్తారు.

నీడలా వెన్నంటే..

ముద్రణ విభాగంలో పనిచేసే సిబ్బంది ఎవరైనా అత్యవసరంగా బయటకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తే.. సదరు వ్యక్తి వెంట ఓ ఇంటెలిజెన్స్‌ అధికారి, ఓ పోలీసు ఉంటారు. వారు అనుక్షణం ఆయనను నీడలా అనుసరిస్తారు. అత్య‌వ‌స‌రం అయితే త‌ప్పా బ‌య‌ట‌కు ఎవ్వ‌రిని పంపించ‌రు. సిబ్బందిపై ఇంటెలిజెన్స్ అధికారులు ప్ర‌త్యేక నిఘా ఉంచుతారు.

బ‌డ్జెట్‌ ప్ర‌వేశ‌పెట్టే రోజు

బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టే రోజు ఉదయం 11 గంటలకు ఆర్థికశాఖ మంత్రి పార్లమెంటుకు బడ్జెట్‌ను సమర్పిస్తారు. సభలో ప్రవేశపెట్టేముందు రాష్ట్రపతి, ప్రధానమంత్రికి బడ్జెట్‌ గురించి పూర్తిగా వివరిస్తారు.

1950లో బడ్జెట్‌ లీక్ కావ‌డంతో..

పరీక్ష పేపర్లే కాదు.. బడ్జెట్‌ పేపర్లు కూడా లీకైన సంఘటన 1950లో చోటుచేసుకుంది. అప్పట్లో బడ్జెట్‌ పత్రాల్ని రాష్ట్రపతి భవన్‌లో ముద్రించేవారు. 1950లో ఈ పత్రాలు లీక్‌ కావడంతో అప్పటి నుంచి మింట్‌రోడ్‌లోని సెక్యూరిటీ ప్రెస్‌కు వేదికను మార్చారు. 1980 నుంచి ఢిల్లీలోని నార్త్‌ బ్లాక్‌లో బడ్జెట్‌ పత్రాల్ని ముద్రిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ప్రింటింగ్‌ ప్రెస్‌ను ఏర్పాటు చేశారు.

Next Story