కరోనా ఎఫెక్ట్ : పరీక్షలు వాయిదా
By రాణి Published on 19 March 2020 3:32 PM IST![కరోనా ఎఫెక్ట్ : పరీక్షలు వాయిదా కరోనా ఎఫెక్ట్ : పరీక్షలు వాయిదా](https://telugu.newsmeter.in/wp-content/uploads/2020/03/CBSE-ICSE-ISE-Exams-Postponed.jpg)
దేశంలో ప్రస్తుతం ఉన్న కరోనా ఎఫెక్ట్ అంతా ఇంతా కాదు. మాస్క్ లు ధరించినా..శానిటైజర్లు పూసుకున్నా ఈ వైరస్ సోకకుండా ఉంటుందన్న గ్యారెంటీ లేదు. శానిటైజర్లు మన చేతులకు ఉన్న క్రిములు చచ్చిపోయేలా చేస్తుంది. అలాగని దేనిని ముట్టుకున్నా శానిటైజర్లు పూసుకోవాలంటే నిమిషానికోసారి శానిటైజర్ వాడాల్సిందే. కాగా..కరోనా వైరస్ ప్రభావంతో జాతీయ స్థాయిలో జరిగే అన్ని పరీక్షలను ఆయా బోర్డులు వాయిదా వేశాయి. అంతకుముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమైతే నేటి నుంచి జరగాల్సిన సీబీఎస్ఈ పన్నెండవ తరగతి, టెన్త్ పరీక్షలు వాయిదా పడ్డాయి. సీబీఎస్ఈ పరీక్షలు మార్చి 19 నుంచి 31వ తేదీ వరకు జరగాల్సి ఉంది.
Also Read : మంత్రులు, అధికారులతో కేసీఆర్ అత్యవసర భేటీ
సీబీఎస్ఈ పరీక్షలతో పాటుగా ఐసీఎస్ఈ, ఐఎస్సీ 10, 12వ తరగతి పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలోనే ఈ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు బోర్డు అధికారులు ప్రకటించారు. అయితే వాయిదా వేసిన పరీక్షలను మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తారన్న విషయాన్ని మార్చి 31వ తేదీ తర్వాత ప్రకటిస్తామని తెలిపారు సంబంధిత బోర్డుల అధికారులు.
Also Read : కరోనా ఎఫెక్ట్.. కుదేలవుతున్న ఆర్థిక వ్యవస్థ
తాజాగా దేశంలో కరోనా బాధితుల సంఖ్య 180కి చేరింది. మరోవైపు కరీంనగర్ లో కరోనా కేసులు పెరుగుతుండటంతో 144 సెక్షన్ విధించారు. అలాగే దేశంలోని ప్రధాన ఆలయాలన్నీ ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. నేటి నుంచి చిలుకూరు బాలాజీ ఆలయం మూతపడగా, రెండ్రోజుల క్రితమే షిరిడి ఆలయం కూడా మూతపడింది. రేపటి నుంచి పూరీ జగన్నాథస్వామి ఆలయం కూడా మూతపడనుంది. కరోనా ప్రభావంతో తిరుమలకు భారీ స్థాయిలో భక్తుల రద్దీ తగ్గింది. అలిపిరి చెకింగ్ పాయింట్ వద్ద పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. మెట్ల మార్గం, ఘాట్ రోడ్డుల దారిని కూడా టిటిడి అధికారులు మూసివేశారు. కాసేపట్లో తిరుమల వెంకటేశ్వరస్వామి ఆలయం కూడా మూసివేయనున్నట్లు సమాచారం. ఈ మేరకే టీటీడీ అధికారులు అత్యవసర సమావేశమైనట్లు తెలుస్తోంది.
Also Read : ఎండలో నిలబడితే ‘కరోనా’ చచ్చి పోతుంది.. కేంద్రమంత్రి ఉచిత సలహా