మూడేళ్ల చిన్నారి కోసం.. ఇంటర్‌పోల్‌ పోలీసులు

By అంజి  Published on  28 Feb 2020 10:35 AM GMT
మూడేళ్ల చిన్నారి కోసం.. ఇంటర్‌పోల్‌ పోలీసులు

ఢిల్లీ: ఓ మూడేళ్ల చిన్నారి కోసం.. సీబీఐ, ఇంటర్‌పోల్‌ పోలీసులు తీవ్ర గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు ఆ చిన్నారిని పట్టుకున్నారు. ఆమె అసలు ఎవరు.. ఎందుకు పట్టుకున్నారు. ఆమె చేయరాని తప్పేదైనా చేసిందా అన్న డౌట్స్‌ మీకు రావచ్చు.. అయితే ఇది పూర్తిగా చదవాల్సిందే..

ఢిల్లీలో నివాసం ఉండే తల్లి దండ్రుల మధ్య నడిచిన పోరులో.. ఈ అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ప్రముఖ పారిశ్రామిక వేత్త కుమారుడైన అమల్‌ లోహియాకు గత కొన్ని సంవత్సరాల క్రితం పెళ్లైంది. అతని భార్య చర్మ వ్యాధి నిపుణురాలు. వీరి దాంపత్యం కొన్ని సంవత్సరాలు సజావుగానే సాగింది. వీరికి మూడేళ్ల కుమార్తె రైనా కూడా ఉంది. ఆ తర్వాత కొంత కాలనికి వీరి మధ్య విబేధాలు వచ్చాయి. దీంతో ఇద్దరు విడిపోయి కోర్టు మెట్లెక్కారు. కోర్టు ఆ చిన్నారిని తల్లికి అప్పగించింది. ఈ క్రమంలోనే వారంలో మూడు రోజులు కూతురిని కలవవచ్చని తండ్రికి సూచించింది. అయితే అదే సమయంలోనే విదేశాలకు పారిపోకుండా పాస్‌పోర్టును సమర్పించాలని కోర్టు లోహియాను ఆదేశించింది.

అయితే గత సంవత్సరం ఆగస్టు 24న తన బిడ్డను లోహియాను కలిశాడు. ఆమె తీసుకొని ఎంచక్కా దుబాయ్‌కి చెక్కేశాడు. దొంగతనంగా డొమినికా దేశపు పాస్‌పోర్టును లోహియా సంపాదించాడు. ఆ తర్వాత చిన్నారిని తీసుకొని నేపాల్‌ నుంచి దుబాయ్‌కి వెళ్లాడు. కాగా ఈ అంశం ఇప్పుడు అంతర్జాతీయ అంశాలతో ముడిపడి ఉండటంతో ఈ కేసును ఢిల్లీ హైకోర్టు సీబీఐకి అప్పగించింది. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ.. ఇంటర్‌ పోల్‌ సాయం తీసుకుంది. దుబాయ్‌లో వీరి ఆచూకీని కనిపెట్టిన ఇంటర్‌పోల్‌.. వారిని అదుపులోకి తీసుకుంది. అక్కడి నుంచి లోహియతో పాటు చిన్నారిని స్వదేశానికి తీసుకొచ్చారు సీబీఐ అధికారులు. లోహియాపై పలు సెక్షన్ల కింద సీబీఐ కేసు నమోదు చేసింది.

Next Story