రివర్స్ షాకింగ్: డాక్టర్‌ సుధాకర్‌పై సీబీఐ కేసు నమోదు

By సుభాష్  Published on  3 Jun 2020 5:34 AM GMT
రివర్స్ షాకింగ్: డాక్టర్‌ సుధాకర్‌పై సీబీఐ కేసు నమోదు

విశాఖలోని నర్సీపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యునిగా పని చేస్తున్న డాక్టర్‌ సుధాకర్‌ వివాదం ఏపీ రాజకీయాల్లో తీవ్ర సంచలనం రేపుతోంది. ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ కేసును సీబీఐకి అప్పగించిన విషయం తెలిసిందే. ఇక దర్యాప్తు చేపడుతున్న సీబీఐ సుధాకర్‌కే షాకిచ్చింది.

హైకోర్టు ఆదేశాలతో సుధాకర్‌ కేసు దర్యాప్తు చేపట్టిన సీబీఐ అధికారులు.. అంతకు ముందు పోలీసులపై కేసు నమోదు చేయగా, తాజాగా డాక్టర్‌ సుధాకర్‌పైనా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు సీబీఐ తన వెబ్‌ సైట్‌లో పొందుపర్చింది

ఓ ప్రభుత్వ ఉద్యోగి అయివుండి ప్రజాప్రతినిధులను దూషించడం, విధి నిర్వహణలో ఉన్న పోలీసులపైనా అసభ్యకరంగా ప్రవర్తించడం, ఓ కానిస్టేబుల్‌ మొబైల్‌ను కిందపడేయడం, స్థానికులను భయభ్రాంతులకు గురి చేయడం లాంటివి ఆరోపిస్తూ సీబీఐ కేసు నమోదు చేసింది. అంతేకాదు 23 మంది సాక్షుల సమాచారంతో పాటు 130 పేజీలతో కూడిన సీడీ ఫైల్‌ను సీబీఐకి పోలీసులు అప్పగించారు. వీటన్నింటిని పరిశీలించిన మీదట డాక్టర్‌ సుధాకర్‌పై కేసు నమోదు చేసింది. లాక్‌డౌన్‌ సమయంలో నిబంధనలు ఉల్లంఘించినందుకు సెక్షన్‌ 188 నమోదైంది.

కాగా, విచారణను ప్రారంభించిన వెంటనే సీబీఐ విశాఖలో కొందరు పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులపై కొన్ని సెక్షన్లకింద కేసు నమోదు చేసింది. వీటిలో కుట్ర కోణం, కావాలని తిట్టడం, అక్రమ నిర్బంధం, చోరీ, బెదిరింపులు వంటి సెక్షన్లు ఉన్నాయి. కాగా, సుధాకర్‌కు వైద్యాన్ని అందజేస్తోన్న మానసిక వైద్యులు రామిరెడ్డిని విధుల నుంచి తప్పించిన సీబీఐ అధికారులు.. ఆయన స్థానంలో డాక్టర్ మాధవీలతను నియమించారు. రెండో విడతలో ఏకంగా డాక్టర్ సుధాకర్‌పైనే కేసులు నమోదు చేయడం సంచలనంగా మారింది.

Next Story