మరో వివాదంలో కౌన్ బనేగా కరోడ్ పతీ.. అమితాబ్‌పై కేసు.!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  3 Nov 2020 6:43 AM GMT
మరో వివాదంలో కౌన్ బనేగా కరోడ్ పతీ.. అమితాబ్‌పై కేసు.!

బిగ్ బీ అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'కౌన్ బనేగా కరోడ్ పతీ' కార్యక్రమం మరో వివాదంలో చిక్కుకుంది. ఈ కార్య‌క్ర‌మంలో హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఓ ప్రశ్నను అడిగారని పేర్కొంటూ లక్నోకు చెందిన ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఎఫ్ఐఆర్ న‌మోదు చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. షో నిర్వాహ‌కుల‌తో పాటు అమితాబ్‌పై కూడా పోలీసులు కేసు న‌మోదు చేశార‌ట‌.

వివ‌రాల‌లోకెళితే.. శుక్రవారం నిర్వహించిన కరమ్ వీర్ స్పెషల్ ఎపిసోడ్‌లో సామాజిక వేత్త బెజవాడ విల్సన్‌, నటుడు అనూప్‌ సోనీ పాల్గొనగా.. ఆయన్ను ఓ ప్రశ్న అడిగారు. ఇది వివాదానికి తెరలేపింది. డిసెంబర్‌ 25వ తేదీ1927న డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌, ఆయన అనుచరులు ఏ గ్రంథ ప్రతులను తగులబెట్టారు అనే ప్రశ్న అడిగారు అమితాబ్. వీటికి 'ఎ) విష్ణు పురాణ బి) భగవద్గీత సీ) రిగ్వేద డి) మనుస్మృతి' అని ఆప్షన్స్ ఇచ్చారు. కంటెస్టెంట్ ఆన్సర్ ఇచ్చిన త‌ర్వాత 'కుల వివక్ష, అస్పృశ్యతను పెంపొందించేలా ఉందనే కారణంతో మనుస్మృతిని అంబేద్కర్ తగలబెట్టారని బిగ్ బీ పేర్కొన్నారు. ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీయడమేనని వ్యక్తి ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేశారు.

Next Story