చెక్బౌన్స్ అయితే జైలు శిక్ష.. ఆర్బీఐ కొత్త నిబంధనలు
చెక్ బౌన్స్ కేసులు పెరుగుతుండడంతో భారతీయ రిజర్వ్ బ్యాంకు (RBI) 2025కి గాను కీలక మార్పులను ప్రవేశపెట్టింది.
By - Knakam Karthik |
చెక్బౌన్స్ అయితే జైలు శిక్ష.. ఆర్బీఐ కొత్త నిబంధనలు
చెక్ బౌన్స్ కేసులు పెరుగుతుండడంతో భారతీయ రిజర్వ్ బ్యాంకు (RBI) 2025కి గాను కీలక మార్పులను ప్రవేశపెట్టింది. నకిలీ లావాదేవీలు, చెల్లింపుల ఆలస్యం, చెక్ను ఉద్దేశపూర్వకంగా బౌన్స్ చేయించడం వంటి సమస్యలను నియంత్రించేందుకు కొత్త నిబంధనలు రూపొందించామని RBI వర్గాలు తెలిపాయి. తాజా మార్పుల్లో భాగంగా, చెక్ బౌన్స్ అయిన సందర్భంలో విధించే జరిమానాను రెట్టింపు చేయనున్నట్లు సమాచారం. అలాగే, పునరావృతంగా చెక్ బౌన్స్ చేసిన వారికి లేదా ఉద్దేశపూర్వకంగా చెల్లింపులు తప్పించుకునే వారికి జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉండనుంది.
చెక్ బౌన్స్ చరిత్ర ఉన్న కస్టమర్లకు బ్యాంకులు చెక్బుక్ సౌకర్యాన్ని నిలిపివేయడం, పరిమితి విధించడం వంటి అధికారాలు కూడా ఇవ్వబడుతున్నాయి. దీంతో, నిర్లక్ష్యంగా చెక్లు జారీ చేసే వారిపై కఠినంగా వ్యవహరించే అవకాశం ఉంది. చెక్ బౌన్స్ కేసుల తీర్పులు ఆలస్యమవుతుండటంపై ఆక్షేపణలు వచ్చిన నేపథ్యంలో, కోర్టుల్లో కేసుల పరిష్కార ప్రక్రియను వేగవంతం చేయడానికి కొన్ని సందర్భాల్లో కోర్టు ఫీజులు అవసరం లేకుండా చేసే అవకాశం కూడా ఈ నిబంధనల్లో ఉంది.
చెక్ బౌన్స్ కేసులు చట్టపరంగా Negotiable Instruments Act, 1881లోని సెక్షన్ 138 కింద నేరంగా పరిగణించబడతాయి. తాజా మార్పుల్లో భాగంగా, కేసుల విచారణకు సంబంధించిన ఆధారాలుగా SMSలు, ఇమెయిల్స్, బ్యాంక్ నోటిఫికేషన్లు వంటి ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ను కోర్టులు ఉపయోగించుకునే అనుమతిని కూడా స్పష్టంగా పేర్కొన్నారు. ఈ చర్యలతో చెక్ లావాదేవీల్లో పారదర్శకత పెరుగుతుందని, చెల్లింపుల్లో జాగ్రత్తలు మరింత కట్టుదిట్టం అవుతాయని RBI ఆశిస్తోంది.