ATM, UPI నగదు ఉపసంహరణలపై కొత్త రూల్స్..ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి
ఏప్రిల్ 1వ తేదీ నుండి బ్యాంకింగ్ రంగంలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి.
By - Knakam Karthik |
ATM, UPI నగదు ఉపసంహరణలపై కొత్త రూల్స్..ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి
ఏప్రిల్ 1వ తేదీ నుండి బ్యాంకింగ్ రంగంలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ముఖ్యంగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తన ఏటీఎమ్ నగదు ఉపసంహరణ లెక్కింపు విధానాన్ని సవరించింది. ఇకపై డెబిట్ కార్డుతో పాటు యూపీఐ యాప్ల ద్వారా చేసే నగదు ఉపసంహరణలను కూడా ఉచిత లావాదేవీల కోటాలోనే పరిగణిస్తారు. నిర్ణీత పరిమితి దాటిన తర్వాత చేసే ప్రతి లావాదేవీకి రూ. 23 తో పాటు పన్నులు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) తన డెబిట్ కార్డులపై రోజువారీ నగదు ఉపసంహరణ పరిమితిని తగ్గించింది. ఖాతాదారుల రిస్క్ మేనేజ్మెంట్లో భాగంగా కార్డు రకాన్ని బట్టి ఈ పరిమితిని రూ. 50 వేల నుంచి రూ. 75 వేల మధ్యకు కుదించింది.
జియో పేమెంట్స్ బ్యాంక్ తన కస్టమర్ల కోసం క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా బ్యాంకింగ్ కరస్పాండెంట్ల వద్ద నగదు పొందే కొత్త సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది. అలాగే, రూపే ప్లాటినం డెబిట్ కార్డులపై ఉచిత ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ పొందాలంటే ఇకపై కచ్చితంగా నిర్ణీత మొత్తంలో ఖర్చు చేయాలనే నిబంధనను ఎన్పీసీఐ అమలులోకి తెచ్చింది. ఏప్రిల్ నుంచి అమల్లోకి వచ్చే ఈ కొత్త నిబంధనల పట్ల ఖాతాదారులు అప్రమత్తంగా ఉండి, అనవసరపు చార్జీల భారం పడకుండా చూసుకోవడం ఉత్తమం.