మైక్రోసాఫ్ట్లో లే ఆఫ్ల పరంపర..ఈ సారి 300 మంది తొలగింపు
ప్రముఖ సాంకేతిక సంస్థ మైక్రోసాఫ్ట్ మరోసారి ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను కొనసాగించింది.
By Knakam Karthik
మైక్రోసాఫ్ట్లో లే ఆఫ్ల పరంపర..ఈ సారి 300 మంది తొలగింపు
ప్రముఖ సాంకేతిక సంస్థ మైక్రోసాఫ్ట్ మరోసారి ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను కొనసాగించింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3 శాతం మంది ఉద్యోగులను తగ్గించిన కొన్ని వారాల్లోనే, ఇప్పుడు మరికొంత మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా సంస్థాగత పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ నిర్ణయాలు తీసుకుంటున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది.
ఇప్పటికే వేలాది మందిని ఉద్యోగాల నుండి తొలగించిన ఈ సంస్థ, తాజాగా మరొకసారి 300 మంది ఉద్యోగులకు ఉద్వాసన చెప్పింది. సంస్థ కార్యకలాపాల్లో కృత్రిమ మేధ (ఏఐ) వినియోగాన్ని విస్తృతంగా పెంచే ఉద్దేశంతో తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయాల ఫలితంగా ఈ ఉద్యోగాల కోత చోటుచేసుకున్నట్టు సమాచారం. ఈ అంశాన్ని బ్లూమ్బర్గ్ తన తాజా నివేదికలో వెల్లడించింది. కృత్రిమ మేధ,ఆటోమేషన్ వంటి ఆధునిక సాంకేతికతల వైపు దృష్టిసారిస్తున్న మైక్రోసాఫ్ట్, ఈ దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఉద్యోగుల సంఖ్యను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా గత నెలలో సంస్థ దాదాపు 6,000 మంది ఉద్యోగులను తొలగించింది.
గత నెలలో జరిగిన 'మైక్రోసాఫ్ట్ బిల్డ్ 2025' కార్యక్రమంలో కంపెనీ చీఫ్ కమ్యూనికేషన్స్ ఆఫీసర్ ఫ్రాంక్ ఎక్స్ షా మాట్లాడుతూ, "మనం ఏఐ ఏజెంట్ల యుగంలోకి ప్రవేశించాం" అని అన్నారు. రీజనింగ్ మరియు మెమొరీలో అద్భుతమైన పురోగతి కారణంగా ఏఐ నమూనాలు ఇప్పుడు మరింత సమర్థవంతంగా మారాయని, గిట్హబ్ కోపైలట్ను ఇప్పటికే 15 మిలియన్ల డెవలపర్లు ఉపయోగిస్తున్నారని ఆయన తెలిపారు. అలాగే, లక్షలాది మంది కస్టమర్లు మైక్రోసాఫ్ట్ 365 కోపైలట్ను వాడుతున్నారని, 2,30,000కు పైగా సంస్థలు కోపైలట్ స్టూడియోతో ఏఐ ఏజెంట్లను రూపొందించుకున్నాయని ఆయన వివరించారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే కంపెనీ తన కార్యకలాపాలను పునర్వ్యవస్థీకరిస్తున్నట్లు తెలుస్తోంది.