ఎల్పీజీ సిలిండర్‌ ధరల్లో ఎలాంటి పెంపు లేదు: కేంద్రం

దేశీయ గృహ వినియోగదారుల కోసం ఉపయోగించే ఎల్పీజీ (LPG) సిలిండర్ ధరల్లో ఎలాంటి పెంపు జరగలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

By -  అంజి
Published on : 2 Jan 2026 7:30 AM IST

central government, LPG cylinder prices, LPG, domestic household consumers

ఎల్పీజీ సిలిండర్‌ ధరల్లో ఎలాంటి పెంపు లేదు: కేంద్రం

దేశీయ గృహ వినియోగదారుల కోసం ఉపయోగించే ఎల్పీజీ (LPG) సిలిండర్ ధరల్లో ఎలాంటి పెంపు జరగలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కొన్ని మీడియా కథనాల్లో కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలు ₹111 పెరిగాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.

ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం, కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల ధరలు మార్కెట్ ఆధారితంగా, అంతర్జాతీయ ధరలకు అనుసంధానమై ఉంటాయి. గ్లోబల్ ఎల్పీజీ ధరల్లో మార్పుల మేరకు కమర్షియల్ సిలిండర్ ధరలు సవరించబడతాయి. అయితే గృహ వినియోగదారుల ఎల్పీజీ ధరలు మాత్రం యథాతథంగా కొనసాగుతున్నాయి.

భారతదేశం తన ఎల్పీజీ అవసరాల్లో సుమారు 60 శాతం దిగుమతి చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో సౌదీ అరేబియా కాంట్రాక్ట్ ప్రైస్ (Saudi CP) అంతర్జాతీయ ప్రమాణంగా పరిగణించబడుతోంది. జూలై 2023లో మెట్రిక్ టన్నుకు 385 డాలర్లుగా ఉన్న సౌదీ CP, నవంబర్ 2025 నాటికి 466 డాలర్లకు చేరి సుమారు 21 శాతం పెరిగినా, అదే కాలంలో దేశీయ ఎల్పీజీ ధరలు ₹1103 నుంచి ₹853కి తగ్గి సుమారు 22 శాతం తగ్గాయి.

ప్రస్తుతం ఢిల్లీలో 14.2 కిలోల దేశీయ ఎల్పీజీ సిలిండర్ వాస్తవ ధర సుమారు ₹950 కాగా, సాధారణ (నాన్-పీఎంయూవై) వినియోగదారులకు ₹853కు, ఉజ్వల పథకం (PMUY) లబ్ధిదారులకు కేవలం ₹553కే అందుబాటులో ఉంది.

ఇది పీఎంయూవై లబ్ధిదారులకు సుమారు 39 శాతం ధర తగ్గింపుని ప్రతిబింబిస్తోంది. ఈ ధరల్లో ఎలాంటి మార్పు లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను, పీఎంయూవై లబ్ధిదారులకు సంవత్సరానికి 9 రీఫిల్ల్స్ వరకు ప్రతి సిలిండర్‌పై ₹300 సబ్సిడీని కొనసాగించేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. దీనికై ₹12,000 కోట్ల వ్యయాన్ని కేటాయించింది.

అంతర్జాతీయ ఎల్పీజీ ధరలు పెరిగినా, గృహ వినియోగదారులపై భారం పడకుండా ప్రభుత్వం ధరలు పెంచకపోవడం వల్ల చమురు మార్కెటింగ్ కంపెనీలకు (OMCs) ₹40,000 కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపింది. ఈ నష్టాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం తాజాగా ₹30,000 కోట్ల పరిహారాన్ని ఆమోదించింది.

నవంబర్ 1, 2025 నాటికి పొరుగుదేశాలతో పోలిస్తే భారతదేశంలో ఎల్పీజీ ధరలు తక్కువగా ఉన్నాయని ప్రభుత్వం పేర్కొంది.

పీఎంయూవై లబ్ధిదారులకు ఢిల్లీలో సిలిండర్ ధర ₹553గా ఉండగా, పాకిస్తాన్‌లో ₹902, శ్రీలంకలో ₹1227, నేపాల్‌లో ₹1205గా ఉంది.

ఇదిలా ఉండగా, కొత్త సంవత్సరం ప్రారంభంతో శుభవార్తగా, కొన్ని నగరాల్లో సిఎన్‌జీ (CNG), పిఎన్‌జీ (PNG) ధరలు తగ్గించబడ్డాయి. ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో పిఎన్‌జీ ధరలు తగ్గగా, కొన్ని నగరాల్లో సిఎన్‌జీ, గృహ పిఎన్‌జీపై లీటర్‌కు/యూనిట్‌కు ₹1 తగ్గింపు ప్రకటించారు. పైప్‌లైన్ టారిఫ్‌లలో మార్పుల కారణంగా ఈ తగ్గింపులు జరిగాయని గ్యాస్ సంస్థలు తెలిపాయి.

ప్రస్తుతం దేశంలో 33 కోట్లకు పైగా గృహ ఎల్పీజీ వినియోగదారులు ఉండగా, కమర్షియల్ ఎల్పీజీ వినియోగదారులు కేవలం సుమారు 30 లక్షలు మాత్రమే. కమర్షియల్ సిలిండర్లు ప్రధానంగా హోటళ్లు, రెస్టారెంట్లు, పెద్ద వ్యాపార సంస్థలు వినియోగిస్తాయని ప్రభుత్వం తెలిపింది.

మొత్తంగా, కమర్షియల్ ఎల్పీజీ ధరలు అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో మారుతున్నప్పటికీ, గృహ వినియోగదారులను ధరల పెరుగుదల నుంచి రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కొనసాగుతున్నాయని, శుభ్రమైన ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని కేంద్రం ప్రకటనలో పేర్కొంది.

Next Story