విమాన ప్రయాణం మరింత ప్రియం.. జెట్‌ ఇంధన ధరలు పెంపు

Aviation turbine fuel price hiked by 2% to all-time high.విమానాల్లో వాడే ఇంధన ధరలను చమురు సంస్థ‌లు భారీగా పెంచాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 April 2022 6:17 AM GMT
విమాన ప్రయాణం మరింత ప్రియం.. జెట్‌ ఇంధన ధరలు పెంపు

విమానాల్లో వాడే ఇంధన ధరలను చమురు సంస్థ‌లు భారీగా పెంచాయి. శుక్ర‌వారం పెంచిన రేట్లతో దేశీయంగా ఏవియేషన్ టర్బైన్​ ఫ్యూయల్​ (ఏటీఎఫ్​) ధర కిలో లీటర్​కు జీవనకాల గరిష్ఠ స్థాయికి చేరింది. దేశంలో ప్రతి 15 రోజులకు ఒకసారి ఏటీఎఫ్ ధరలు సవరించే విధానం అమలులో ఉంది. దీనితో తాజాగా ధరలను సవరించాయి చమురు సంస్థలు. అంతర్జాతీయంగా పెరిగిన ముడి చమురు ధరలకు అనుగుణంగా.. ఏటీఎఫ్​ ధరలను స‌వ‌రించాయి.

తాజాగా ఎంత పెరిగాయి?

ఏటీఎఫ్ కిలో లీట‌ర్ పై రూ.2,258.54(2 శాతం) పెంచుతూ చమురు మార్కెటింగ్ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో ఢిల్లీలో కిలో లీటర్ ఏటీఎఫ్​ ధర రూ.1,12,924.83 కు చేరింది. ఈ సంవ‌త్స‌రంలో ఏటీఎఫ్ ధ‌ర పెర‌గ‌డం ఇది వ‌రుస‌గా ఏడోసారి. అంత‌క‌ముందు మార్చి 16న ఏటీఎఫ్ కిలో లీట‌ర్ పై ఏకంగా 18.3 శాతం పెంచిన సంగ‌తి తెలిసిందే.

మొత్తంగా ఈ ఏడాదిలో ఇప్ప‌టి వ‌ర‌కు ఏటీఎఫ్ ధ‌ర రూ.38,902.92(50శాతానికి పైగా) పెరిగింది. విమాన నిర్వ‌హ‌ణలో దాదాపు 40 శాతం వాటా వ్య‌యం ఇంధ‌నానిదే. దీంతో రాబోయే రోజుల్లో విమాన ప్ర‌యాణీకుల‌పై మ‌రింత భారం ప‌డే అవ‌కాశం ఉంది.

Next Story