వలస కూలీలపైకి దూసుకెళ్లిన బస్సు.. ఆరుగురు మృతి
By Newsmeter.Network
కరోనా మహమ్మారి ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తుంది. రోజురోజుకు వైరస్ వ్యాప్తి పెరుగుతుండటంతో కేంద్రం దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించింది. దీంతో ప్రజలంతా నెలన్నరగా ఇండ్లకే పరిమితం అవుతున్నారు. ఇటీవల కేంద్రం లాక్డౌన్ నిబంధనలు కొంతమేర సడలించింది. దీంతో నెలన్నరగా తినడానికి తిండిలేక, స్వస్థలాలకు వెళ్లే వీలులేక ఇబ్బందులు పడుతున్న వలస కూలీలు ఇంటిబాట పట్టారు. పలు మార్గాల ద్వారా తమతమ స్వస్థలాలకు చేరుకుంటున్నారు. ఈ క్రమంలో బీహార్కు చెందిన వలస కూలీలు పంజాబ్లో ఉంటున్నారు. వీరిలో ఆరుగురు కూలీలు కాలినడకన బీహార్లోని తమ గ్రామానికి బయలుదేరారు.
Also Read :బస్సు, ట్రక్కు ఢీకొని వలస కూలీలు మృతి
బుధవారం రాత్రి 11గంటల సమయంలో ఉత్తరప్రదేశ్లోని ముజఫర్ నగర్ - సహరాన్పుర్ రహదారిపై కాలినడకన వెళ్తున్నారు. వేగంగా వచ్చిన అదే రాష్ట్రానికి చెందిన ఆర్టీసీ బస్సు కూలీలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో వారంతా అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకొని క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మృతులను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు.