'కమ్మిన్స్' కుమ్మేశాడు.. అందుకే ఐపీఎల్లో అంత ధర..!
By న్యూస్మీటర్ తెలుగు Published on 28 Dec 2019 8:55 AM GMT'బాక్సింగ్ డే' టెస్టులో ఆసీస్ పుంజుకుంది. ఐసీఎల్ వేలంలో అత్యధిక ధర పలికి అందరిని ఆశ్యర్యపరిచిన ఆసీస్ బౌలర్ ప్యాట్ కమ్మిన్స్.. కివీస్ను బెంబేలెత్తించాడు. న్యూజిలాండ్ను తన తొలి ఇన్నింగ్స్లో 148 పరుగులకే కట్టడి చేయడంలో కీలకపాత్ర పోషించాడు. ఏ దశలోనూ బ్యాటింగ్కు దిగిన జట్టును తేరుకోనీయకుండా చేసి ఆ జట్టు పతనాన్ని శాసించాడు. వరుస విరామాల్లో వికెట్లు సాధిస్తూ కివీస్ ఆటగాళ్లను హడలెత్తించాడు. కమ్మిన్స్కు జతగా జేమ్స్ పాటిన్సన్ మూడు వికెట్లు, మిచెల్ స్టార్క్కు రెండు వికెట్లు తీయడంతో కివీస్ తక్కువ స్కోరుకే ఆలౌటయ్యింది.
కివీస్ ఆటగాళ్లలో ఓపెనర్ టామ్ లాథమ్(50) మినహా ఎవరూ రాణించలేదు. 44/2 ఓవర్నైట్ స్కోరుతో శనివారం ఆటను కొనసాగించిన కివీస్.. మరో 104 పరుగులు చేసి మిగతా 8వికెట్లను కోల్పోయింది. దాంతో ఆసీస్కు 319 పరుగుల ఆధిక్యం లభించింది. అంతకుముందు అసీస్.. తొలి ఇన్నింగ్స్లో 467 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్(114), స్టీవ్ స్మిత్(85), లబూషేన్(63), టిమ్ పైన్(79), డేవిడ్ వార్నర్(41)లు రాణించారు.